పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. అంతర్జాతీయ వేదిక మీద పరువు పోగొట్టుకున్నారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం జరిగిన సీన్.. తాజాగా మరోసారి రిపీట్ అయ్యింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎదుట.. పాక్ ప్రధాని తన చేవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. తాజాగా చైనాలో నిర్వహించిన షాంఘై సహాకార సదస్సు సమావేశం సందర్భంగా ఈ సీన్ కనిపించింది. పుతిన్ , పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ కార్యక్రమం జరిగింది. దీని కోసం పుతిన్ ఇయర్ ఫోన్ పెట్టుకుని భేటీకి రెడీ కాగా.. పాక్ ప్రధాని మాత్రం ఇయర్ ఫోన్ పెట్టుకోవడం రాక.. నానా తంటాలు పడ్డారు.
చివరకు పుతిన్ స్పందిస్తూ.. తన చెవిలోని ఇయర్ ఫోన్ తీసి మరీ.. ఇదిగో ఇలా పెట్టుకోవాలి అని పాక్ ప్రధానికి చూపించారు. దాని ప్రకారం షరీఫ్ తన ఇయర్ ఫోన్ సెట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడ్డ షరీఫ్.. నవ్వుకున్న పుతిన్ అనే క్యాప్షన్తో వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు మూడు సంవత్సరాల క్రితం కూడా ఇలానే జరిగింది.. అప్పుడు కూడా షరీఫ్ ఇదే సమస్యతో బాధపడ్డారు.. ఇలానే పుతిన్ ముందు పరువు పోగొట్టుకున్నారంటూ పాత వీడియోని కూడా షేర్ చేస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితం అనగా 2022లో ఉబ్జెకిస్థాన్ పర్యటనలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ టూర్లో భాగంగా పాక్ ప్రధాని షరీఫ్ పుతిన్తో భేటీ అయ్యారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు షరీఫ్కు ఇదే సమస్య ఎదురైంది. పాక్ పీఎం ఇయర్ఫోన్ పెట్టుకుంటుండగా.. అది సెట్ అవ్వక పడిపోసాగింది. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. షరీఫ్కు సాయం చేశారు. అయితే గతంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నెటిజనులు, విదేశీ ప్రముఖులు ఈ సంఘటనను ట్రోల్ చేశారు. ప్రముఖ కమెడియన్ జిమ్మీ ఫాలన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. 22 కోట్ల మంది పాక్ ప్రజలకు ఈ షరీఫ్ ప్రధాని అంటే ఆశ్చర్యం కలుగుతోంది అని కామెంట్ చేశారు.
చైనాలోని తియాన్జిన్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు ఎస్సీఓ సదస్సు జరిగింది. భారత్, రష్యా, పలు దేశాల అధ్యక్షులతో పాటుగా పాక్ ప్రధాని కూడా దీనిలో పాల్గొన్నారు. అయితే అడుగడుగునా.. పాక్ ప్రధానికి ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. మోదీ, పుతిన్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకొని వెళ్తుంటే షరీఫ్ చేతులు కట్టుకొని అలా చూస్తూ ఉండిపోయిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఇక ఇదే సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ అంశంపై పాక్ నోరు మెదపలేకపోయింది. అలానే భారత్, రష్యాల మధ్య స్నేహం చూసిన పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా, మాస్కో సంబంధాలను గౌరవిస్తామని.. దాంతో ఎలాంటి ఇబ్బందిలేదని చెప్పుకొచ్చారు. అలానే తాము కూడా రష్యాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని షరీఫ్.. పుతిన్కు చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa