ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. 12, 28 శాతం శ్లాబ్‌లు తొలగింపు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 08:35 PM

బుధవారం సమావేశం అయిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబ్‌లలో రెండు శ్లాబ్‌లను తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 12, 28 శాతం శ్లాబ్‌లు ఇక ఉండవని.. కేవలం 5, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. సామాన్యులపై భారం పడకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్‌ పరిధిలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.


5 శాతం పన్ను శ్లాబ్‌లోకి వచ్చిన వస్తువులు


హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు, సైకిళ్లు, టేబుల్‌లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటివరకు 12, 18, 28 శాతం శ్లాబుల నుంచి 5 శాతం శ్లాబులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.


5 శాతం పన్ను శ్లాబ్‌ నుంచి జీఎస్టీ రద్దు చేసిన వస్తువులు


ఇప్పటివరకు 5 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పన్నీర్, బ్రెడ్‌లపై పన్నును సున్నాకు తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆరోగ్య, జీవిత బీమాలపై ఇప్పటివరకు ఉన్న జీఎస్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించారు. వైద్య, వ్యవసాయ రంగాలపై ఆధారపడిన వారికి భారీ ఊరట కల్పించారు.


12, 18 శాతం నుంచి 5 శాతం శ్లాబుల్లోకి వచ్చిన వస్తువులు


చాలా రకాల తిను బండారాలను 5 శాతం శ్లాబులోకి తీసుకువచ్చారు. ఉప్పు, భుజియా, సాస్‌లు, పాస్తా, నూడుల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వచేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి పన్ను శాతాన్ని 5కు తగ్గించారు.


28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులు


ఏసీలు, అన్ని రకాల టీవీల పైనుంచి 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. డిష్ వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లు 18 శాతం శ్లాబులోకి తీసుకువచ్చారు. సిమెంట్‌పై ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై 40 శాతం జీఎస్టీ విధించనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa