షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సు సాక్షిగా అమెరికాకు భారత్, చైనా, రష్యా, బలమైన సందేశం పంపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కలిసి ఉన్న ఒక ఫోటో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. ప్రపంచంపై ఆసియా ఆధిపత్యం చెలాయించబోతుంది అనడానికి ఇది సంకేతామని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాధిత దేశాధినేతలు ఒకే వేదికపై నవ్వులు పంచుకుని, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఫోటోలు పశ్చిమ మీడియా దృష్టిని ఆకర్షించారు. అమెరికాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు వాన్ జోన్స్ మాట్లాడుతూ.. ఈ దృశ్యాలు ‘ప్రతి అమెరికన్ వెన్నులో చలి పుట్టించే’లా ఉన్నాయని అన్నారు.
జోన్స్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ... ‘ఈ రోజును చారిత్రాత్మకంగా చాలా పెద్ద మలుపుగా గుర్తుంచుకుంటాం.. ఎందుకంటే ఆ ఫోటోలో భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్లతో షీ జిన్పింగ్ కలిసి ఉన్న ఫోటో ప్రతి అమెరికన్ వెన్నులో చలి పుట్టించే అంశం’ అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాన్ని ‘నూతన ప్రపంచ వ్యవస్థ’ కు సంకేతంగా ఆయన అభివర్ణించారు. ఎస్సీఓ సదస్సులో వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీలు చేతిలో చేయివేసుకుని నవ్వుకుంటూ.. జిన్పింగ్ వద్దకు రాగా..., తర్వాత ముగ్గురూ గ్రూప్ ఫోటో దిగారు.
‘‘ఒకప్పుడు ఇలా అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం అందులో లేము.. అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు. అది అమెరికాకు మంచిది కాదు’’ అని ఆయన అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. అమెరికా వ్యతిరేక వర్గంగా ముద్రపడిన నాలుగు దేశాలైన ఇరాన్, ఉత్తర కొరియా, చైనా, రష్యాల మొదటి సమావేశంగా విశ్లేషకులు అభిప్రాయపడినట్టు పేర్కొంది. ‘ఇది పలు సందేశాలు పంపింది.. జిన్పింగ్, పుతిన్ మధ్య ఉన్న స్నేహం అమెరికాను సవాలు చేసే ప్రత్యామ్నాయ ప్రపంచ వ్యవస్థ నాయకులుగా వారి మధ్య సన్నిహిత బంధాన్ని తెలియజేసేలా ఉంది... డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సుంకాలతో భారత్ను దూరం చేసుకోవాలనుకుంటే వారికి చైనాతో సహా మిగతా స్నేహితులు ఉన్నారు’ అని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
యాదృచ్ఛికంగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో సైనిక కవాతు నిర్వహించడానికి ఒక రోజు ముందే ఎస్సీఓ సదస్సు జరగడం చెప్పుకోదగ్గ అంశం. చైనా అధునాతన సైనిక పాటవాన్ని లక్షలాది మంది వీక్షిస్తుండగా.. జిన్పింగ్, పుతిన్, కిమ్లు ఒకరి భుజం ఒకరు చేయి వేసి నిలబడ్డారు. ‘బలవంతులు బలహీనులను వేటాడే ఆటవిక చట్టానికి ఎప్పటికీ తిరిగి రావద్దు’ అని ఈ సందర్భంగా జిన్పింగ్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa