ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ధ్వంసం చేసిన నూర్ ఖాన్ ఎయిర్బేస్ను పాకిస్థాన్ పునర్నిర్మిస్తున్నట్టు ఉపగ్రహా ఫోటోలు బయటపెట్టాయి. ఇస్లామాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూర్ ఖాన్ పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన అతి ముఖ్యమైన స్థావరం. మే 10 తేదీ తెల్లవారుజామున భారత్ జరిపిన క్షిపణి దాడిలో నూర్ ఖాన్ ఎయిర్బేస్ ధ్వంసమైంది. అక్కడ ఉన్న రెండు ప్రత్యేక ట్రక్కులను టార్గెట్ చేసుకుని క్షిపణి దాడి చేసింది. డ్రోన్ కమాండ్, నియంత్రణ కోసం వినియోగించే వ్యవస్థలు, రెండు ట్రక్కులు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి.
నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ ఏరకం క్షిపణులతో దాడిచేసిందనేది మాత్రం ధ్రువీకరించలేదు. కానీ, బ్రహ్మోస్ లేదా స్కాల్ప్ క్షిపణులు లేదా రెండింటినీ ప్రయోగించడం వల్లే ఎయిర్బేస్ ధ్వంసమైనట్టు భావిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ను భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాల నుంచి, స్కాల్ప్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ నుంచి ప్రయోగించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ను భారత్ సైన్యం చేపట్టి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తీవ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దీంతో ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణలు తలెత్తి.. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో సాధారణ పరిస్థితులు నెలకున్నాయి.
ఇక, నూర్ ఖాన్ ఎయిర్బేస్పై దాడికి ముందు, తర్వాత పరిస్థితులను ఉపగ్రహాలు తీసిన ఫోటోలు బయటపెట్టాయి. తాజాగా, ఆ వైమానిక స్థావరాన్ని పాక్ పునర్నిర్మిస్తోన్నట్టు తాజాగా తీసిన ఫోటోలు వెల్లడించాయి. ప్రముఖ జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సిమోన్ మాట్లాడుతూ.. ‘‘మే 10న భారత్ క్షిపణి దాడిలో ధ్వంసమైన నూర్ ఖాన్ ఎయిర్బేస్ పునర్నిర్మాణాన్ని పాకిస్థాన్ మొదలుపెట్టింది.. ఆ వైమానిక స్థావరంలోని ఒక చోట ఉంచిన ప్రత్యేక సైనిక వాహనాలను భారత్ లక్ష్యంగా చేసుకోవడంతో అవి ధ్వంసమయ్యాయి.. పక్కనే ఉన్న భవనాలకు నష్టం వాటిల్లింది. తత్ఫలితంగా అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్నాయి.. దాడితో నిర్మాణాలు బలహీనపడటంతో చుట్టుపక్కల ఉన్న అనేక వాటిని కూల్చివేశారు’’ అని అన్నారు.
మరోవైపు, ఆపరేషన్ సిందూర్ షమయంలో భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద శిబిరాలను కూడా మళ్లీ ప్రారంభిస్తున్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో వాటి పునర్నిర్మాణం కోసం ముష్కర మూకలు విరాళాలు సేకరించే పనిలో ఉన్నాయని ఇటీవల నిఘా వర్గాలు నివేదిక బయటపెట్టింది. బహావల్పుర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం భారత్ సైన్యం దాడిలో పూర్తిగా భూస్థాపితం కాగా.. మళ్లీ దానిని రిపేర్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa