విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపు సమయంలో అధికారుల కళ్లు గప్పి డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. నిందితుల్లో ఒకరు ఆలయ పర్మినెంట్ ఎంప్లాయి కొణతాల రమణ కాగా.. మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్.ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం హుండీ కానుకల లెక్కింపు మొదలుపెట్టారు. అయితే, మధ్యాహ్నం 12 గంటల సమయంలో పర్మినెంట్ ఎంప్లాయి కొణతాల రమణ.. ఒక వేస్ట్ పేపర్లో నోట్ల కట్టను చుట్టి.. దాన్ని సురేష్కు ఇచ్చాడు. దాన్ని సురేష్ ఒక బ్యాగులో పెట్టాడు. ఈ విషయాన్ని ఈవో త్రినాథరావు గమనించారు. బ్యాగ్ చెక్ చేయమని ఏఈవో రమణమూర్తిని ఆదేశించారు. బ్యాగ్ చెక్ చేయగా.. పేపర్లో చుట్టిపెట్టిన నోట్ల కట్ట బయటపడింది. అన్నీ ఐదువందల నోట్లే. మొత్తం 55 నోట్లు ఉన్నాయి. అంటే 50 వేల 500 రూపాయలు దొంగిలించారు. వెంటనే ఏఈవో రమణమూర్తి.. గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మినెంట్ ఎంప్లాయి రమణను ఈవో సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఎంప్లాయి సురేష్ను విధుల నుంచి తొలగించారు. ఈ సురేష్.. 98వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్ తమ్ముడు అని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa