వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రోజుకో రకమైన ఊహాగానాలు వస్తున్న వేళ.. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను.. నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్లో స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి ప్రైవేటీకరణ వ్యాఖ్యలు చేసే బాధ్యతారహిత పార్టీలకు చెందిన నేతలు.. ఇక నుంచైనా తమ ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
నష్టాల్లో నడుస్తున్న వైజాగ్ ఉక్కు పరిశ్రమను.. తిరిగి లాభాల్లోకి తీసుకువచ్చేందుకు.. కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేస్తోందని భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ ఆరోపణలు చేసేవారు ఇప్పటికైనా అలాంటి మాటలు మాట్లాడొద్దని పేర్కొన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన కేంద్రమంత్రి.. అది పరిశ్రమను కాపాడేందుకేనని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్ను కూడా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అంతా సహకరించాలని కోరారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ట్రేడ్ యూనియన్ నేతల సాయంతో తిరిగి పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్రమంత్రి వెల్లడించారు. సామాన్యుల జీవితాల్లో సమూల మార్పులు రానున్నాయని పేర్కొన్నారు. 4 శ్లాబులు ఉన్న జీఎస్టీని 2 శ్లాబ్లకు తీసుకురావడంతో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత వెసులుబాటు కలగనుందని తెలిపారు.
ఇక నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వేలు, నేషనల్ హైవేలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని శ్రీనివాసవర్మ వెల్లడించారు. ఎన్హెచ్-165 రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైందని స్పష్టం చేశారు. అతి త్వరలోనే నరసాపురం - చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఇక నరసాపురం - అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఒకే దగ్గర ఉండేలా కలెక్టరేట్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa