ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 పైసల నుంచి రూ. 41 కి పెరిగిన షేర్ ధర.. లక్షకు రూ. 2.59 కోట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 10:48 PM

స్టాక్ మార్కెట్లలో కొన్ని స్టాక్స్ అద్భుతం చేస్తుంటాయి. ఊహించని రీతిలో అనతి కాలంలోనే పెరుగుతూ కాసుల పంట పండిస్తుంటాయి. అయితే ఇక్కడే మనం ఏ స్టాక్ ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో అంచనా వేయగలగాలి. ఇందు కోసం.. స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. ఏదో ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేయవద్దు. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా ఆయా కంపెనీల నుంచి వచ్చేటువంటి ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నింటినీ పరిశీలిస్తూ జాగ్రత్తగా పెట్టుబడి చేయాల్సి ఉంటుంది.


ఇంకా స్టాక్ మార్కెట్లలో షార్ట్ టర్మ్ కంటే.. దీర్ఘకాలం మంచి రిటర్న్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఆయా కంపెనీలు ప్రకటించే బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, డివిడెండ్ ఇలా పలు కారణాల వల్ల అదనపు లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే వీటిని పరిగణనలోకి తీసుకోవడం మంచిది.


ఇప్పుడు మనం.. దీర్ఘ కాలంలో ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచిన ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం. అదే హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఈ స్టాక్ రాణించింది. ఈ కంపెనీ ను నమ్ముకొని ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసిన వారికి కాసుల వర్షం కురిపించింది.


ఈ స్టాక్ ధర ఒకప్పుడు పైసల్లో ఉండేది. అక్కడినుంచి భారీగా పెరిగిందని చెప్పొచ్చు. 2015 సెప్టెంబర్ నెలలో.. కేవలం 16 పైసలుగా ఉన్న షేరు ధర.. అక్కడినుంచి ఏటా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు దీని ధర రూ. 41.40 వద్ద ఉంది. ఈ క్రమంలో.. అప్పుడు స్టాక్ కొనుగోలు చేసిన వారికి కళ్లుచెదిరే రాబడి ఇచ్చింది. అంటే 10 సంవత్సరాల కిందట ఇందులో ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 2.59 కోట్లు వచ్చాయి.


2024లో ఈ కంపెనీ 1:10 రేషియోలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే ఇన్వెస్టర్ దగ్గర 10 ఈక్విటీ షేర్లు ఉంటే.. వారికి దానిపై ఒక్కో షేరు ఉచితంగా లభించేది. దీని వల్ల స్టాక్ ధర తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. గురువారం సెషన్.. ఈ స్టాక్ ధర స్వల్పంగా పెరిగి రూ. 41.40 వద్ద స్థిరపడింది. గత ఐదేళ్లలో మరింత ఎక్కువగా ఏకంగా 41,130 శాతం పెరిగినా.. ఏడాది నుంచి చూస్తే పడిపోతోంది. ఏడాదిలో ఈ స్టాక్ 17 శాతం తగ్గింది. నెలలో 10 శాతం, 6 నెలల్లో 20 శాతం పతనమైంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 63.90 కాగా.. కనిష్ట ధర రూ. 32 గా ఉంది. ఇక కంపెనీ మార్కెట్ విలువ చూస్తే రూ. 948.78 కోట్లుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa