చైనాతో సరిహద్దు వివాదమే భారత్కు అతిపెద్ద సవాల్.. రెండోది పాకిస్తాన్: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్(ఫోటోలు- Samayam Telugu)
భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న సరిహద్దు వివాదాలు.. అప్పుడప్పుడూ తీవ్రం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పొరుగు దేశాలతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్.. దేశ భద్రతకు సంబంధించి ఉన్న సవాళ్లను పేర్కొన్నారు. చైనాతో ఉన్న పరిష్కారం కాని సరిహద్దు వివాదమే భారత్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని సీడీఎస్ తెలిపారు. ఆ తర్వాత పాకిస్తాన్ నడుపుతున్న పరోక్ష యుద్ధం అనేది రెండవ పెద్ద సవాల్ అని వెల్లడించారు.
తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ .. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. భారత భద్రతకు ఎదురవుతున్న ఆరు ప్రధాన సవాళ్లను జనరల్ చౌహాన్ వివరించారు. చైనాతో సరిహద్దు వివాదం భారత్కు మొట్టమొదటి అతిపెద్ద సవాలని పేర్కొన్న సీడీఎస్.. భారత్ను వెయ్యి ముక్కలు చేసి రక్తపాతం చేయాలనుకుంటున్న పాకిస్తాన్ ఆ తర్వాతి సవాల్ అని వెల్లడించారు. భారత్ను నిరంతరం గాయపరుస్తూ బలహీనపరచాలని పాక్ కుట్రలు చేస్తోందని సీడీఎస్ పేర్కొన్నారు. భారత్కు పొరుగున ఉన్న దేశాల్లో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితులు కూడా దేశ భద్రతపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
ఇక భవిష్యత్లో జరగనున్న యుద్ధాలు.. కేవలం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లతో.. భూమి, నీరు, నింగి నుంచి మాత్రమే పరిమితం కావని కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ దాడులు, అంతరిక్ష, ఎలక్ట్రోమాగ్నెటిక్ రంగాలను కూడా కలుపుకుని దాడులు ఉంటాయని.. వాటి కోసం సిద్ధంగా ఉండటం కూడా ఒక అతిపెద్ద సవాలు అని జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భారత్కు ఇద్దరు అణ్వాయుధ శత్రువులు ఉన్నారని.. అలాంటి సమయంలో భారత్ ఎలాంటి సంప్రదాయ యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలని తెలిపారు. భవిష్యత్లో జరగనున్న యుద్ధాల్లో టెక్నాలజీ చూపించే ప్రభావం కూడా ఒక ప్రధాన సవాలు అని సీడీఎస్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ ప్రస్తావనను సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. సరిహద్దు ఉగ్రవాదంపై ఇప్పటివరకు సహనంతో వేచి చూస్తున్న భారత్.. ఒక రెడ్ లైన్ను గీసిందని స్పష్టం చేశారు. ఇక ఆపరేషన్ సిందూర్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్.. కీలక పాత్ర పోషించారని.. టార్గెట్ల ఎంపిక, సైన్యం మోహరింపు, దౌత్యపరమైన అంశాలపై అజిత్ ధోవల్ మార్గనిర్దేశం చేశారని సీడీఎస్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa