ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అన్నప్రసాదం పంపిణీ నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 09:26 PM

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయం సుమారుగా 12 గంటల పాటు మూతపడనుంది. అలాగే భక్తులకు శ్రీవారి దర్శనాన్ని 15 గంటలపాటు నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 7) మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల నుంచి సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం మూడు గంటల వరకూ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు చేసింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపింది.


చంద్రగ్రహణం సెప్టెంబరు 7వ తేదీ 9.50 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి ఒంటి గంటా 31 నిమిషాలకు ముగుస్తుంది. అయితే గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకే తిరుమల ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. అనంతరం సెప్టెంబరు 8వ తేదీ సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత ఆలయంలో శుద్ధి, పుణ్యహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత.. తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన వంటి కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.


మరోవైపుచంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంనుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ నిలిపివేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటల వరకూ అన్నప్రసాద వితరణ ఉండదు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.


సెప్టెంబరు 7న సాయంత్రం నుంచి 30 వేల పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభోత్సవ మండ‌పంతో పాటుగా.. రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో కార్యాలయం, ఏఎన్సీ ప్రాంతాల్లోని కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వద్ద వీటిని భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa