ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ ఎఫ్‌బీఐ ఇన్ఫార్మర్‌, ఎప్‌స్టీన్‌ను చంపాలని చూశారు: మైక్ జాన్సన్ సంచలనం

international |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 10:25 PM

అమెరికా రాజకీయాలు మరోసారి సంచలన ఆరోపణతో అట్టుడికిపోతున్నాయి. యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థించుకునే క్రమంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ట్రంప్ ఒకప్పుడు జెఫ్రీ ఎప్‌‌‌‌‌‌‌‌స్టీన్‌ను చంపడానికి ఎఫ్‌బీఐ ఇన్ఫార్మర్‌గా పని చేశారని అన్నారు. అయితే ఇలా చేయడానికి పెద్ద కారణమే ఉందన్నారు. ఎంతో మంది మహిళలు, చిన్న పిల్లల జీవితాలను ఎప్‌స్టీన్ నాశనం చేశారని.. ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్‌స్టీన్‌పై విపరీతమైన కోపం ఉండేదని వివరించారు. అందుకే అతడిని చంపేందుకు ట్రంప్ ఇన్ఫార్మర్‌గా పని చేశారని వెల్లడించారు.


అమెరికాలో అతిపెద్ద కుంభకోణంగా పేరొందిన సెక్స్ కుంభకోణంలో.. జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రధాన నిందితుడు. అయితే దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. జెఫ్రీ ఎప్‌స్టీన్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసులో అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటపడ్డాయి. అయితే ఎప్‌స్టీన్‌ను జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసులో అనేక ప్రశ్నలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఈక్రమంలోనే ట్రంప్‌కు కూడా ఈ కేసుతో సంబంధం ఉందంటూ అనేక మంది ఆరోపించారు.


ఎలాన్ మస్క్ సైతం ట్రంప్‌కు, ఎప్‌స్టీన్‌కు మధ్య స్నేహం ఉండేదని.. ఈ కేసుతో కూడా అమెరికా అధ్యక్షుడికి సంబంధం ఉందని బహిరంగంగానే చెప్పారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కేసు బాధితులు కూడా దీనిపై తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే.. ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లోని నిందితుల సొంత జాబితాను తామే రూపొందిస్తామని బాధితులు హెచ్చరించారు. ఇది బాధితుల చేత బాధితుల కోసమే జరుగుతుందని.. ఎప్‌స్టీన్ కేసులో బాధితురాలు లిసా ఫిలిప్స్ చెప్పినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.


మరోవైపు రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాస్సీ, డెమొక్రాట్ ప్రతినిధి రో ఖన్నా ఒక ద్విపక్ష బిల్లును తీసుకువస్తున్నారు. ఈ బిల్లు ద్వారా ఎప్‌స్టీన్ ఫైళ్లను పూర్తిగా విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ బిల్లును సభలో ఓటుకు పెట్టేందుకు మాస్సీ డిస్‌ఛార్జ్ పిటిషన్‌పై పని చేస్తున్నారు. ఈ పిటిషన్‌కు మొత్తంగా 218 మంది సభ్యుల సంతకాలు అవసరం. అయితే ఇప్పటి వరకు 214 సంతకాలు వచ్చాయని.. మరో నాలుగు సంతకాలు కూడా త్వరలోనే పొందుతామని ఎక్స్ వేదికగా మాస్సీ చెప్పుకొచ్చారు.


ఈక్రమంలోనే యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ దీనిపై స్పందించారు. ట్రంప్‌ను గట్టిగా సమర్థించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఎప్‌స్టీన్‌ను అంతం చేయడానికి ట్రంప్ FBI ఇన్ఫార్మర్‌గా పని చేశారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ట్రంప్ ఇన్ఫార్మర్‌గా పని చేస్తుండగా.. ట్రంప్‌కు చెందిన మార్-ఎ-లాగో-క్లబ్‌తో సంబంధాలు ఉన్నప్పటి నుంచే ఎప్‌స్టీన్ గురించి అధికారులకు చెప్పేవారని వివరించారు. బాధితులపై సానుభూతి వల్లే ఎప్‌స్టీన్‌ను చంపాలనుకున్నారని కూడా వెల్లడించారు. అయితే ఈ ఆరోపణల వెనుక జాన్సన్‌కు ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అంతేకాకుండా ఈ ఆరోపణలపై అటు ట్రంప్ గానీ ఇటు ఆయన బృందం గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa