ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా హ్యాకర్ల చేతిలో అమెరికన్లందరి డేటా.. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌ల సమాచారం కూడా

international |  Suryaa Desk  | Published : Sat, Sep 06, 2025, 10:27 PM

గతేడాది చైనా హ్యాకర్లు ప్రపంచాన్ని వణికించే సైబర్ దాడికి దిగారని.. తాజాగా అమెరికా అధికారులు చెప్పడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలోని 80 దేశాలపై సాల్ట్ టైఫూన్ హ్యాకర్లు సైబర్ దాడి చేసినట్లు వెల్లడి కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ హ్యాకర్లు గతేడాది..భారీ సైబర్ దాడికి పాల్పడ్డినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ భారీ సైబర్ దాడిలో డొనాల్డ్ ట్రంప్ , జేడీ వాన్స్ ‌ సహా దాదాపు ప్రతీ ఒక్క అమెరికన్ పౌరుడి వ్యక్తిగత సమాచారం చోరీకి గురైందని పేర్కొన్నారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండగా.. జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే ఈ సైబర్ దాడి జరిగిన తర్వాత విచారణ చేపట్టిన అమెరికా అధికారులు.. ఎట్టకేలకు ఒక సంవత్సరం తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.


ఈ సైబర్ దాడి చేసిన హ్యాకర్లను సాల్ట్ టైఫూన్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ సాల్ట్ టైఫూన్ హ్యాకర్ల టీమ్.. ప్రపంచ దేశాల్లో ఉన్న టెలికమ్యూనికేషన్స్ కంపెనీలకు సంబంధించిన వ్యవస్థలే టార్గెట్‌గా ఈ భారీ సైబర్ దాడికి పాల్పడినట్లు అమెరికా విచారణ అధికారులు వెల్లడించారు. ఈ హ్యాకర్లు.. చాలా దూరంలో ఉన్న ప్రాంతాల్లోని నెట్‌వర్క్‌లను కూడా కంట్రోల్ చేయవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. గూఢచారులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల లాంటి కీలక వ్యక్తులకు సంబంధించిన కదలికలను ట్రాక్ చేయగలరని హెచ్చరించారు.


'ది ఇండిపెండెంట్' ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో.. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఫోన్లను కూడా ఈ హ్యాకర్ల బృందం హ్యాక్ చేసినట్లు తెలిపింది. ఇక ఈ సైబర్ దాడి చాలా పెద్దది అని.. ఏ ఒక్క అమెరికన్ కూడా ఈ సైబర్ దాడి నుంచి తప్పించుకుని ఉంటారని తాను అనుకోవడం లేదని.. దీనిపై దర్యాప్తు పర్యవేక్షించిన మాజీ ఎఫ్‌బీఐ అధికారి సింథియా కైసర్ వెల్లడించారు.


  ఇక ఈ భారీ సైబర్ దాడిలో కనీసం 3 చైనా టెక్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి. ఈ సంస్థలు చైనా ఆర్మీ, గూఢచార సంస్థలకు తరచుగా సైబర్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయని పేర్కొన్నారు. హ్యాకింగ్ చేసిన తర్వాత.. వారి ఫోన్ కాల్స్‌ను వినడం.. మెసేజ్‌లు రీడ్ చేయడం, అందులోని ఫైల్స్‌ను యాక్సెస్ చేసే కెపాసిటీ.. హ్యాకర్లకు ఉందని బ్రిటీష్ దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ దాడితో చైనా సైబర్ కెపాసిటీ ఏ స్థాయికి చేరుకుందో అర్థం అవుతోందని పేర్కొన్నాయి. ప్రపంచంలో ఆధిపత్యం సాధించాలనే చైనా కోరికకు ఇది ఒక సంకేతమని సైబర్ నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa