ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో గూగుల్ డేటా సెంటర్.. ఆసియాలోనే అతి పెద్దది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 07:24 PM

సాగరతీరం విశాఖపట్నానికి ప్రముఖ కంపెనీలు తరలి వస్తున్నాయి.టీసీఎస్, కాగ్నిజెంట్, లులూ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఐటీ కంపెనీ గూగుల్ కూడా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ప్రభుత్వం భూములను కూడా గుర్తించింది. ఈ భూములను నవంబర్ నెలలో గూగుల్ సంస్థకు అప్పగించి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.


మరోవైపు ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గతేడాది డిసెంబర్ నెలలోనే గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్యన ఎంవోయూ కుదిరింది. ఆ తర్వాత గూగుల్ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ విశాఖలో పర్యటించారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ అంగీకారం తెలిపారు. దీంతో తర్లువాడ వద్ద డేటా సెంటర్ కోసం భూమిని సేకరించే పనిలో అధికారులు పడ్డారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం మొత్తం 200 ఎకరాలు అవసరం అవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో డీపట్టా భూములు, పరిహారం ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ నెలలో భూములను గూగుల్ సంస్థకు అప్పగించే పనిలో అధికారులు ఉన్నారు.


మరోవైపు గూగుల్ డేటా సెంటర్ కోసం.. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి సముద్ర మార్గంలో విశాఖకు కేబుల్ వేయనున్నారు. సముద్ర గర్భంలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ లైన్ ల్యాండింగ్‌ స్టేషన్‌ విశాఖలో ఏర్పాటు కానుంది. మరోవైపు ఇది కనుక ఏర్పాటైతే.. గూగుల్‌తోపాటు, అదానీ డేటా సెంటర్‌కు కూడా స్పీడ్ ఇంటర్నెట్ అవసరాలు తీరుతాయి. ఇక విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్ డేటా సెంటర్ సుమారుగా ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఐటీ రంగంలో విశాఖపట్నం స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని అధికారులు చెప్తున్నారు.


మరోవైపు విశాఖపట్నాన్ని ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్తున్న ప్రభుత్వం.. అందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే పనిలో ఉంది. అందులో భాగంగా పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ , టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa