ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్తను అందించింది. మరో కేంద్ర సంస్థను ఏపీలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేలా ప్రోత్సాహం అందిస్తున్న కేంద్రం.. ఇతర రంగాలలోనూ ఏపీకి సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ స్కూల్ ఆప్ డ్రామా బ్రాంచిని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం రోజున పాలకొల్లులో జరిగిన నాలుగవ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరంలో నవంబర్లో నంది డ్రామా ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నంది అవార్డులను ప్రదానం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో 60 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తోందని, తెలంగాణ నుంచి 40 శాతం రెవెన్యూ మాత్రమే వస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే షూటింగ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయనే విషయాన్ని ప్రస్తావించారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ ఏపీకి తరలి రావాల్సిన అవసరం ఉందని కందుల దుర్గేష్ అన్నారు.
ఈ క్రమంలోనే రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. రాష్ట్ర కళాత్మక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా.. సాంస్కృతిక రూపాలు, కార్యక్రమాలు, ప్రదర్శనలను చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రయత్నాలకు పూర్తిగా మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బి. గోపాల్, రేలంగి నరసింహారావులకు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa