ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది చాలా అద్భుతం.. కానీ నేను చూడలేకపోవచ్చు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 07:15 PM

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట వైరల్ అయ్యే అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారాయన. మారుమూల ప్రాంతాల్లో ఉండే వారి టాలెంట్ దగ్గర నుంచి.. అద్భుతమైన నిర్మాణాల వరకూ ప్రతి అంశంపైనా తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సాగరతీరం విశాఖలో ఏర్పాటు కానున్న గ్లాస్ స్కైవాక్ (గాజు వంతెన) నిర్మాణంపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. కైలాసగిరి వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ నిర్మాణం అద్భుతమన్న ఆనంద్ మహీంద్రా.. ప్రపంచంలోనే ఎత్తైన గ్లాస్ స్కైవాక్‌లలో ఒకటిగా పిలుస్తున్నారని అన్నారు. అయితే ఇంత అద్భుతమైన థ్రిల్‌ను తాను అనుభవించలేకపోవచ్చంటూ ఆయన ట్వీట్ చేశారు.


" వైజాగ్‌లో ఉన్న కైలాసగిరి కొండ వద్ద ఈ కొత్త గ్లాస్ స్కైవాక్ వచ్చే వారం ప్రారంభమవుతుందని సమాచారం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటిలో ఒకటిగా ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చైనా ఇప్పటికే స్కైవాక్ ఎత్తు, పొడవులో ప్రపంచ రికార్డులను కలిగి ఉంది. జాంగ్జియాజీ గాజు వంతెన భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో, 430 మీటర్ల పొడవుతో ఉంది. వైజాగ్ గ్లాస్ స్కైవాక్ కూడా 262 మీటర్ల వర్టికల్ డ్రాప్‌తో ఏర్పాటు చేశారు. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది, కానీ.. ఇది నేను చూసే ప్రదేశాల్లో చేరుతుందా లేదా అంటే.. బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఎత్తైన ప్రాంతాలతో నాకు కొంచెం ఇబ్బంది.. ప్రస్తుతానికైతే.. కుర్చీలో కూర్చుని వీడియోల ద్వారా ఈ అందాలను ఆస్వాదిస్తా" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


మరోవైపు విశాఖ గాజు వంతెనను దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా అభివర్ణిస్తున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సహకారంతో RJ అడ్వెంచర్స్ సంస్థ దీనిని నిర్మించింది. కైలాసగిరిపై ‘టైటానిక్‌ షిప్‌ వ్యూ పాయింట్‌’ పక్కన ఈ స్కైవాక్ నిర్మించారు. భూమి నుంచి 55 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. అలాగే ఈ గ్లాస్ వంతెనపై నడిచినప్పుడు గాలిలో ఊగుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ గ్లాస్‌ను సుత్తితో కొట్టినా పగలదని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక కైలాసగిరి కొండపై నుంచి సముద్రం వైపు 100 అడుగుల పొడవు ఉన్న ఈ గాజు వంతెనపై ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉంది. అయితే, భద్రత దృష్ట్యా ఒకసారి 40 మంది పర్యాటకులను మాత్రమే దీనిపైకి అనుమతిస్తారు. ఈ గాజు వంతెన నిర్మాణానికి 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.


స్టీల్‌ను జర్మనీ నుంచి, అద్దాలు, ఇతర రోప్‌లను బెంగళూరు నుంచి తెప్పించి ఉపయోగించారు. ఈ గ్లాస్ వంతెన నుంచి విశాఖ అందాలను వీక్షించేందుకు టికెట్ ధర నిర్ణయించనున్నారు. ఒక్కో టిక్కెట్ ధర 200 నుంచి 250 రూపాయల వరకు ఉండనుంది. కైలాసగిరిలో సముద్ర అందాలను, శివ పార్వతుల విగ్రహాలను చూసేందుకు విశాఖ నుంచే కాకుండా, వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు.


దీనికి తోడు ఇక్కడ ఏర్పాటు చేసిన జిప్లైనర్, స్కై సైక్లింగ్, రోప్‌వే, అద్దాల ఏసీ ట్రైన్‌కు పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వీటి ద్వారా వీఎంఆర్డీఏకు ఆదాయం కూడా దండిగానే సమకూరుతోంది. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన గాజు వంతెనతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa