ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై ట్రంప్ సలహాదారు చౌకబారు వ్యాఖ్యలు.. ఫ్యాక్ట్ చెక్‌తో కౌంటర్ ఇచ్చిన ‘ఎక్స్’

international |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 09:00 PM

రష్యాతో భారత్ వాణిజ్యం, దౌత్య సంబంధాలుపై పదే పదే విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మరోసారి నోరుపారేసుకున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఫ్యాక్ట్ చెక్‌తో దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. అయినా సరే ఆయన మాత్రం.. రష్యా ఆయిల్ దిగుమతితో భారత్ లాభాలు ఆర్జిస్తోందని తన వ్యాఖ్యలను సమర్దించుకోవడం గమనార్హం. ఇంతకీ నవారో ఏమన్నారు? దీనిపై ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసిన అంశం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


  ‘భారత అధిక సుంకాలు విధించడంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నాం.. లాభం కోసం రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది.. ఉక్రెయిన్‌తో రష్యా కొనసాగిస్తోన్న యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది.. ఇరుదేశాల ప్రజలు యుద్ధంలో చనిపోతున్నారు.. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఎక్కువ ఖర్చుచేయాల్సి వస్తోంది.. భారత్ మాత్రం వాస్తవాన్ని గ్రహించడం లేదు’ అని ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ నవారో విమర్శిస్తూ.. ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై ‘ఎక్స్‌’ ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి.. ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. రష్యా నుంచి కేవలం ఇంధన భద్రత కోసమే భారత్‌ చమురు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేసింది.


న్యూఢిల్లీ ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించడంలేదని తేల్చిచెప్పింది. అంతేకాదు, భారత్‌ను వాణిజ్యం ఆపేయాలని ఒత్తిడిచేస్తోన్న అమెరికాయే రష్యా నుంచి యురేనియం వంటి వస్తువులను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోందని, ఇది ద్వంద్వ వైఖరి అని కౌంటర్ ఇచ్చింది, ట్రంప్ సలహాదారు నవారో వ్యాఖ్యలు కపటమైనవి అని పేర్కొంది. అయితే, ఎక్స్ కౌంటర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నవారో.. ఈ క్రమంలో ఎలాన్‌ మస్క్‌ పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్‌ చెక్‌ ఒక చెత్తగా అభివర్ణించారు.


‘‘ వావ్..ప్రజల పోస్ట్‌లతో ఎలాన్ మస్క్ ప్రచారాన్ని అనుమతిస్తున్నారు.. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చెత్త నోట్.. భారత్ లాభాపేక్ష కోసం మాత్రమే రష్యా చమురును కొనుగోలు చేస్తుంది.. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందు ఎలాంటి కొనుగోళ్లు చేయలేదు.. యుద్ధానికి ఆర్ధికంగా నిధులు సమకూర్చుతోంది... ఉక్రేనియన్లను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడం ఆపాలి’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించినప్పటి నుంచి నవారో రెచ్చిపోతున్నారు. టారీఫ్‌లు అమల్లోకి వచ్చిన తర్వాత రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ‘మోదీ యుద్ధం’ అంటూ నోటికి పనిచెప్పారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆయిల్ ద్వారా భారత్‌లోని సంపన్న వర్గాలే లబ్ది పొందుతున్నారని ఇటీవల నవారో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ‘బ్రాహ్మణ్’ అనే పదం దేశంలోని ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినాసరే నవారో మాత్రం తన విమర్శల పరంపర కొనసాగించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa