ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ రేట్ల కోత.... సెప్టెంబర్ 22లోగా చేయాల్సిందే

business |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 11:42 PM

వస్తు, సేవల పన్ను జీఎస్టీలో చేపట్టిన సంస్కరణలను ప్రజల సంస్కరణగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతో దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. వినియోగం పెరుగుతుందని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అయితే, జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ అది ప్రజలకు చేరవేయడంలో కంపెనీలు, హోటళ్లు, దుకాణదారులు జాప్యం చేయవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలకు చేరవేసేందుకు తానే వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. నేరుగా తానే రంగంలోకి దిగి ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటానని, కచ్చితంగా ప్రజలకు అందేలా చూస్తామన్నారు.


పరిశ్రమ సైతం ఇప్పటికే జీఎస్టీ రేట్ల కోతలపై సానుకూలతలు చూపించినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజుల్లోనే కార్ల తయారీ సంస్థల నుంచి బీమా కంపెనీలు, షూ, దుస్తుల బ్రాండ్లు ధరల తగ్గింపును ప్రకటించాయని పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చే సెప్టెంబర్ 22వ తేదీ నాటికి మిగిలిన సంస్థలూ దీనిని అనుసరించే అవకాశాలు ఉన్నాయన్నారు. సెప్టెంబర్ 22 నుంచి కచ్చితంగా తగ్గించిన రేట్లను అమలు చేయాల్సిందేనన్నారు.


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నాటి నుంచే జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి వస్తాయని, అప్పటి నుంచి సబ్బుల నుంచి కార్ల వరకు, ఎయిర్ కండిషనర్ల నుంచి షాంపులు, ట్రాక్టర్ల వరకు మొత్తం 400 ఉత్పత్తుల వరకు ధరలు దిగివస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా ప్రీమియం పన్ను రహితంగా మారుతుందన్నారు. రూపాయి కూడా జీఎస్టీ కట్టాల్సిన అవసరం రాదని, దీంతో ప్రీమియం దిగువస్తుందని చెప్పారు. అయితే, హానికర ఉత్పత్తులు, అల్ట్రా లగ్జరీ వస్తువులపై కొత్త శ్లాబూ 40 శాతం ప్రకారం జీఎస్టీ అమలవుతుందన్నారు,


 కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా జీఎస్టీ సంస్కరణలు 140 కోట్ల మంది ప్రజల జీవితాలను తాకుతాయన్నారు. ఈ దేశంలో జీఎస్టీ నుంచి ఏ ఒక వ్యక్తి సైతం దూరంగా లేరని గుర్తు చేశారు ఆర్థిక మంత్రి. పేదలు, అత్యంత నిరుపేదలు సైతం చిన్న వస్తువును కొనుగోలు చేసినా జీఎస్టీ చెల్లిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరికీ కొత్తగా చేపట్టిన జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. సెప్టెంబర్ 22 తర్వాత 400 వరకు వస్తువుల ధరలు దిగివస్తాయని, అంది ప్రజలకు చేర వేసేందుకు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాననన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa