ఉప-రాష్ట్రపతి ఎన్నికలకు సర్వసిద్ధమైంది. సెప్టెంబర్ 9న (మంగళవారం) పోలింగ్ జరగనుండగా.. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సహాయకులుగా మరో ఇద్దరు అసిస్టెంట్ రిట్నరింగ్ ఆఫీసర్లను నియమించారు.
ఇక, సీక్రెట్ బ్యాలెట్ విధానంలోనే ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పార్టీలు జారీచేసే విప్ చెల్లుబాటు కాదు. అంటే, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు తమ ఆత్మప్రబోధానుసారం ఓటువేయనున్నారు. ఇక, అధికార ఎన్డీయే గెలుపుపై ధీమాతో ఉంది. కానీ, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బీజేపీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆదివారం నాడు బీజేపీ వర్క్షాపు నిర్వహించింది. ఇక, ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా సోమవారం మధ్యాహ్నం మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటింగ్పై అవగాహన కలిగించింది. సోమవారం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ఈ మాక్ పోలింగ్లో విపక్ష పార్టీలు ఎంపీలు పాల్గొన్నారు.
ఓడిపోతారని తెలిసే తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు: చంద్రబాబు
లోక్సభ, రాజ్యసభలో ఖాళీలను మినహాయిస్తే ప్రస్తుతం మొత్తం 781 మంది సభ్యులు (542 మంది లోక్సభ, 239 మంది రాజ్యసభ) ఉన్నారు. ఇందులో 392 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు లేదా చెల్లుబాటైన ఓట్లలో సగాని కంటే ఎక్కువ సాధించిన అభ్యర్ధిని విజేతగా పరిగణిస్తారు. అయితే, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కిందటిసారి జగదీప్ ధన్ఖడ్ పోటీచేసినప్పుడు ఎన్డీయేలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేడీలు మద్దతు తెలిపాయి. దీంతో మూడు దశాబ్దాల తర్వాత భారీ మెజార్టీ (75 శాతం ఓటింగ్)తో ఉప-రాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తిగా ధన్ఖడ్ నిలిచారు. ఈసారి మాత్రం ఓటింగ్కు బీఆర్ఎస్, బీజేడీలు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 770 మంది ఓటువేయనున్నారు.
ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరుపై నడకే. ఎన్డీయేకు మొత్తం 425 మంది సంఖ్య బలం ఉండగా.. వైపీసీ కూడా మద్దతు తెలిపింది. ఏడుగురు స్వతంత్ర ఎంపీలు, అకాలీదళ్, జెడ్పీఎంలకు చెందిన ఒక్కొక్క ఎంపీలను కలుపుకుంటే ఎన్డీయే అభ్యర్థికి 458 ఓట్లు వస్తాయి. ఇక, ప్రతిపక్ష ఇండియా కూటమికి మొత్తం 324 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలు 2022 కంటే ఆసక్తిగా మారాయి. ఎందుకంటే గతేడాది లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షం మెరుగైన ప్రదర్శన చేయడంతో ఎంపీల సంఖ్య పెరిగింది. కానీ, 100 శాతం ప్రతిపక్ష ఎంపీలు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసినా.. ఆయనపై ఎన్డీయే అభ్యర్థి 100 నుంచి 135 ఓట్ల తేడాతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే, త్వరలోనే బిహార్, బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ బలాన్ని నొక్కిచెప్పడానికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని నిలబెట్టాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa