సాధారణంగా ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టాలు ఉండవని చాలా మంది భావిస్తారు. కానీ వారికి కూడా అత్తింటి వేధింపులు తప్పడం లేదని రుజువు చేసే ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని ఫరూఖాబాద్కు చెందిన బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్పుత్ సోదరి రీనా రాజ్పుత్ తన అత్తింటివారి వేధింపులకు గురయ్యారు. భర్త కుటుంబం తరచుగా వేధింపులకు పాల్పడడంతో.. సహనం కోల్పోయిన ఆమె ఎదురు తిరిగింది. భర్తతో పాటు అత్తమామలను ప్రశ్నించగా.. అందరూ చూస్తుండగానే ఆమెపై కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రీనా రాజ్పుత్కు 17 ఏళ్ల క్రితం ఇటా జిల్లా రాణి అవంతి బాయి నగర్కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ పాప కూడా పుట్టింది. కొంతకాలం పాటు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా అత్తింటి వారంతా వేధింపులకు పాల్పడడం మొదలు పెట్టారు. ఎలాగైనా రీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని చూసిన మెట్టినింటి వాళ్లు.. ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె స్నానం చేస్తుండగా ఆమె మామ, బావ రహస్యంగా వీడియో తీశారు. దీన్ని గమనించి ఆమె వారిని గట్టిగా నిలదీశారు.
ఇదేంటని ఆగ్రహంతో ప్రశ్నించగా.. క్షమాపణలు చెప్పి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఆమెపైనే దాడికి పాల్పడ్డారు. తమపైకే నోరు లేపి, ప్రశ్నించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన మామ.. ఆమెను తుపాకీతో కొట్టారు. ఆ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి రీనా బయటకు పరుగెత్తగా.. ఆమె బావమరిది వీధిలో ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై ఇంట్లోని వాళ్లంతా బయటకు వచ్చి ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఈక్రమంలోనే ఆమె గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వగా.. స్థానికులంతా గుమిగూడారు. సెల్ ఫోన్లతో వీడియోలు తీశారే తప్ప ఈ దారుణాన్ని ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేకపోయారు.
తీవ్ర గాయాలపాలైన రీనా ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి మరీ ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా తన అత్తమామలు సహా భర్త వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. తనపై నిత్యం లాఠీలు, కర్రలతో దాడి చేస్తున్నారని, తన కూతురిని కూడా హింసిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఎలాంటి హానీ జరగకుండా చూడాలని అధికారులను వేడుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఓ ఎంపీ సోదరి పరిస్థితే ఇంత దారుణంగా ఉందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ వివరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఇలాంటా ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అలాగే ప్రజలు కూడా.. స్థానికంగా ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించి అడ్డుకోవాలని లేదంటే పోలీసులకైనా తెలపాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa