ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ తన తప్పు తెలుసుకున్నాడు, అందుకే భారత్‌పై మాట మార్చాడు: మాజీ దౌత్యవేత్త

national |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 08:02 PM

భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారని భారత మాజీ దౌత్యవేత్త కేపీ ఫాబియన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో తన పంతం నెగ్గదనే విషయం ఆయనకు అర్థమైందని అన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్‌ను అణగదొక్కాలని ట్రంప్ ప్రయత్నించినా అది విఫలమైందని తెలిపారు. భారత్ ఒక సంస్కృతి కలిగిన దేశమని, అగ్ర రాజ్యాల ఒత్తిళ్లకు లొంగిపోదని విషయం గ్రహించారు కాబట్టే.. భారత్‌పై ట్రంప్ స్వరం మార్చారని వివరించారు.


తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేపీ ఫాబియన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఇండియాపై సుంకాలు విధించినప్పుడు ఆయనకు ఓ విషయం స్పష్టంగా అర్థం అయిందన్నారు. ముఖ్యంగా భారత్ ఇతర దేశాల నుంచి ఆదేశాలు స్వీకరించదని, ఆంక్షలకు ఏమాత్రం లొంగదని ట్రంప్ గుర్తించారన్నారు. భారత ప్రజల శక్తి, ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోకుండా కేవలం బెదిరింపులతో వ్యాపార సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఫాబియన్ వివరించారు. ఈ వాణిజ్యపరమైన ఒత్తిడి కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిందని ఆయన పేర్కొన్నారు.


ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, అధిక సుంకాలు మోపడం వంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. అయితే భారత్ ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచకుండా తమ దేశ ప్రయోజనాలను కాపాడిందని గుర్తు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా దృఢంగా నిలబడిందన్నారు. ఈ పరిణామాలను గమనించిన ట్రంప్.. తన మునుపటి వాదనల నుంచి వెనక్కి తగ్గినట్లు ఫాబియన్ పేర్కొన్నారు. అంతేకాకుండా "భారత్, భారతే" అనే నినాదంతో భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నడుపుతుందని.. మరే దేశంపై ఆధార పడదని నిరూపించిందని ఆయన అన్నారు.


అంతకుముందు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. కానీ ఆ బెదిరింపులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఫాబియన్ గుర్తు చేశారు. దీంతో ట్రంప్ వాటిని అమలు చేశారని.. అయినా ఇండియా తలొగ్గలేదని చెప్పారు. దీంతో మాట మార్చిన ట్రంప్.. మోదీ ఓ మంచి ప్రధాని అని, ఆయనతో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందనిని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా కోపం తగ్గిన తర్వాత భారత్-అమెరికా దేశాల మధ్య బంధాలు మళ్లీ చక్కగా కొనసాగుతాయని స్పష్టం చేశారన్నారు.


అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే అమెరికా-భారత్‌ను ఒక సమానమైన భాగస్వామిగా చూడాలని, దాని సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఫాబియన్ స్పష్టం చేశారు. కేవలం భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా స్నేహపూర్వక, గౌరవపూర్వక సంబంధాలను పెంచుకోవాలని సూచించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa