అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై లిబరేషన్ డే పేరుతో ప్రతీకార సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయంపై స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పరస్పర సుంకాలను’ సుప్రీంకోర్టు కొట్టివేయాలని నిర్ణయించినట్లయితే.. అమెరికా ‘రిబేట్లు’ తిరిగి చెల్లిస్తుందని బెసెంట్ అన్నారు. ట్రంప్ అధిక సుంకాలను విధించడం ద్వారా అధ్యక్షుడు తన అధికార పరిధిని దాటిపోయారని గత నెలలో న్యూయార్క్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మీట్ ది ప్రెస్లో బెసెంట్ ఎన్బీసీ న్యూస్తో మాట్లాడుతూ.. ‘‘పరస్పర సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తే మేము దాదాపు సగం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.. అది ఖజానాకు కొంత ఇబ్బంది కరమే.. కానీ, న్యాయస్థానం చెబితే, మనం అలా చేయాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. అంతకు మించి వివరాలను వెల్లడించని అమెరికా వాణిజ్య మంత్రి.. సుంకాల విషయంలో వెనక్కి తగ్గితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల స్థానాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు.
అయితే, అంతకుముందు అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హసెట్ సీబీఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టారిఫ్లపై సుప్రీంకోర్టులో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇతర న్యాయపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆయన ప్రకారం.. ఉక్కు, అల్యూమినియం సుంకాలను అమలుకు వినియోగించిన సెక్షన్ 232 వంటి ఇతర ఎంపికలలో ఉన్నాయి.
కాగా, సుంకాలలో చాలా వరకు చట్టవిరుద్ధమని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఉత్తర్వులను త్వరగా రద్దు చేయాలని కోరారు. ఆగస్టు 29న అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ 7-4 మెజార్టీతో ట్రంప్ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై సుంకాలను విధించి అధికారాన్ని అధిగమించారని తీర్పు వెలువరించింది. ఈ చర్య అధ్యక్షుడి ఆదేశం పరిధిలోకి రాదని, సుంకాలను విధించే అధికారం ఒక్క కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. దీనికి ముందు మే నెలలో న్యూయార్క్లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టు సైతం టారిఫ్లు చట్టవిరుద్దమని పేర్కొంది.
‘‘జూన్ 2026 వరకు తీర్పును ఆలస్యం చేయడం వలన 750 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు సుంకాలు వసూలు చేసే పరిస్థితి ఉంటుంది.. వాటిని రద్దు చేయడం వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడొచ్చు’ అని ట్రంప్ యంత్రాంగం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. దిగువ కోర్టుల ప్రకారం.. ఆగస్టు 24 నాటికి అమెరికా వ్యాపారాలు చట్టవిరుద్ధంగా భావించిన సుంకాలను కవర్ చేయడానికి 210 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించాయి. సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తే, అమెరికా ట్రెజరీ వసూలు చేసిన సుంకాల ఆదాయాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa