సోషల్ మీడియాపై నిషేధంతో పాటు దేశంలో అవినీతిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కింది నేపాల్ యువత . రాజధాని కాఠ్మండూ వీధుల్లోకి సోమవారం వేలాదిగా వచ్చిన ఆందోళనకారులు.. ఆ దేశ పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లారు. నేపాల్ ప్రభుత్వం 26 అన్-రిజిస్టర్ సోషల్ మీడియా వేదికలను నిషేధించగా.. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ (ఎక్స్) వంటి అమెరికాకు చెందిన ప్లాట్ఫామ్స్ శుక్రవారం నుంచి యూజర్లకు అందుబాటులో లేవు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ వంటి ప్రసిద్ధ ప్లాట్ఫారమ్లపై నేపాల్లో మిలియన్ల మంది నెటిజన్లు వినోదం, వార్తలు, వ్యాపారం కోసం ఆధారపడుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు ముందు నేపాల్ జెండాలతో వీదుల్లోకి వచ్చిన యువత.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ‘సోషల్ మీడియా నిషేధం మమ్మల్ని ప్రేరేపించింది.. కానీ మేము ఇక్కడకు రావడానికి కేవలం అది ఒక్కటి మాత్రమే కారణం కాదు.. నేపాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతున్నాం’ అని ఓ యువకుడు అన్నారు.
ఇక్సామా టుమురోక్ అనే 20 ఏళ్ల విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా తాము ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ‘మేము మార్పు చూడాలనుకుంటున్నాము.. మా పెద్దవాళ్లు దీనిని భరించారు.. కానీ ఇది మా తరంతోనే ముగియాలి’ అని డిమాండ్ చేశాడు.
సోషల్ మీడియాపై నిషేధం తర్వాత సాధారణ నేపాలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతంగా గడుపుతోన్న వీడియోలు టిక్టాక్లో వైరల్ అయ్యాయి. ‘విదేశాలలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.. వారు (ప్రభుత్వం) ఇక్కడ కూడా అలా జరుగుతుందని భయపడుతున్నారు’ అని నిరసనల్లో పాల్గొన్న భూమిక భారతి అనే యువతి పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబరు నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు తమ దేశంలో వారం రోజుల్లో పేర్లు నమోదుచేసుకుని, గ్రీవెన్స్, కంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని గత నెలలో క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తుందని, వారి రక్షణ, అపరిమిత వినియోగం కోసం అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉందని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో నేపాల్ ప్రభుత్వం పేర్కొంది. నేపాల్ గతంలోనే ప్రముఖ సోషల్ మీడియా వేదికలను పరిమితం చేసింది. మనీ ల్యాండరింగ్, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ జులైలో టెలిగ్రామ్ను నిషేధించింది.
గతేడాది ఆగస్టులో చైనాకు చెందిన టిక్-టాక్పై నిషేధం విధించగా.. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని హామీ ఇవ్వడంతో ఇటీవలే ఆంక్షలు తొలగించింది. కానీ, అమెరికాకు చెందిన యాప్లను నిషేధించడంతో యువత ఆందోళన వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కాఠ్మూండూలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా బలగాలను మోహరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa