ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలక పాత్ర పోషించిందని సంస్థ ఛైర్పర్సన్ వి. నారాయణన్ తొలిసారిగా వెల్లడించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం కోసం 400 మందికి పైగా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పనిచేశారని ఆయన తెలిపారు. మంగళవారం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహించిన 52వ జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ కొనసాగినన్ని రోజులూ ఇస్రోకు చెందిన భూ పరిశీలన, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు నిరంతరాయంగా పనిచేశాయని నారాయణన్ వివరించారు. జాతీయ భద్రతా సంస్థలకు అవసరమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహాలు కచ్చితత్వంతో అందించాయని ఆయన వెల్లడించారు. ఈ సమయంలో డ్రోన్లు, క్షిపణులు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఆకాశ్ తీర్' వంటి గగనతల రక్షణ వ్యవస్థలను విస్తృతంగా పరీక్షించారని, ఆధునిక యుద్ధ తంత్రంలో అంతరిక్ష రంగం యొక్క ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేసిందని పేర్కొన్నారు.ఇదే కార్యక్రమంలో ఇస్రో భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా నారాయణన్ మాట్లాడారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర "గగన్యాన్"ను 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 7,700 భూస్థాయి పరీక్షలు పూర్తి చేశామని, వ్యోమగాములను పంపే ముందు మరో 2,300 పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో తొలి మానవరహిత ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత మరో రెండు మానవరహిత ప్రయోగాలు పూర్తి చేసి, వ్యోమగాములతో కూడిన యాత్రలు చేపడతామని స్పష్టం చేశారు.2035 నాటికి పూర్తిగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారని ఇస్రో ఛైర్మన్ గుర్తుచేశారు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇస్రో ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa