పొరుగు దేశం నేపాల్లో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారి దేశాన్ని అట్టుడికిస్తున్నాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన దుబాయ్లో ఆశ్రయం కోరినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపై భద్రతా కారణాలతో నిషేధం విధించడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి ప్రభుత్వ అవినీతి కూడా తోడవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలు అనతికాలంలోనే హింసాత్మకంగా మారాయి. మంగళవారం నిరసనకారులు ఏకంగా పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించి నిప్పుపెట్టడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, తన సొంత దేశంలో జరుగుతున్న హింసపై ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ పరిస్థితులపై స్పందించిన మనీషా కోయిరాలా, ఇన్స్టాగ్రామ్లో రక్తపు మరకలతో ఉన్న ఒక బూటు ఫొటోను షేర్ చేశారు. "ఇది కేవలం ఫొటో కాదు, నేపాల్లో జరుగుతున్న హింసకు సాక్ష్యం. ఇది చాలా భయంకరంగా ఉంది" అని ఆమె ఆవేదన చెందారు. నేపాలీ భాషలో పెట్టిన మరో పోస్టులో, "నేపాల్కు ఇది ఒక చీకటి రోజు. అవినీతికి వ్యతిరేకంగా, న్యాయం కోసం ప్రజలు గొంతెత్తితే బుల్లెట్లతో సమాధానం దొరికిన రోజు ఇది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాజధాని ఖాట్మండూతో పాటు లలిత్పూర్, పోఖారా, బుత్వాల్ వంటి కీలక నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రధాని రాజీనామా చేసినప్పటికీ దేశంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa