మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో కొత్త పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్వయం సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలకు రాయితీ రుణాలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పి్స్తూ అండగా నిలుస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీలోని డీఆర్డీఏ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఓ కొత్త ప్రణాళిక రూపొందించింది. అదే కొరమీనుల పెంపకం. డ్వాక్రా సంఘాల మహిళలకు కొరమీనుల పెంపకం యూనిట్లను కేటాయించి ఉపాధి కల్పించే ఆలోచన చేస్తోంది.
ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో కొరమీనుల పెంపకం యూనిట్లను డీఆర్డీఏ ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. సెప్టెంబర్ రెండో తేదీన గుంటూరు జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, అనుబంధ శాఖల అధికారులను డీఆర్డీఏతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కొరమీను పెంపకం యూనిట్ల ప్రతిపాదనను మత్స్యశాఖ అధికారులు చేశారు. అందులో భాగంగా మొదటి దశలో.. గుంటూరు నగరం, పొన్నూరు, తెనాలిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు కొరమీను పెంపకం యూనిట్లు కేటాయిస్తారు.
రెండో దశలో మంగళగిరి, తాడేపల్లిలో ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉండి, ఆసక్తి కలిగిన మహిళలకు డీఆర్డీఏ, వెలుగు అధికారులు కొరమీను పెంపకం యూనిట్ల ఏర్పాటులో సహకారం అందిస్తారు. ఒక్కో యూనిట్ కోసం రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షలు ఖర్చు కానుంది. ఇందుకోసం స్త్రీనిధి, ఉన్నతి పథకం ద్వారా రుణాలు అందిస్తారు.
అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు కూడా సమకూర్చుతారు. అలాగే అధికారులే మహిళలకు కొరమీను చేప పిల్లలను అందిస్తారు. సెంట్ నుంచి పది సెంట్ల స్థలంలో ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. యూనిట్ల ఏర్పాటు కోసం డీఆర్డీఏ, మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొరమీను పెంపకం యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa