ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం రోజున అల్లూరి సీతారామరాజు జిల్లా , ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రోజున విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ,కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడుగా కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. గురువారం రోజున తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని., మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, అల్లూరి జిల్లా, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లా, విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. పిడుగులు పడి ముగ్గురు చనిపోయిన విషాద ఘటన బుధవారం తెలంగాణలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల్ జిల్లలోని భూంపురంలో పత్తి చేనులో పనిచేస్తు్న్న కూలీలపై బుధవారం సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పిడుగులతో కూడిన వానలు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa