రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలోనే మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లలో భారీగా కోత పెట్టాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్న వారు అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉంది, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సురక్షితంగా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. అలాంటి వాటన్నింటికీ ఈ కథనం ద్వారా సమాధానం తెలుసుకుందాం. మీరు గరిష్ఠ వడ్డీ రేటు కోరుకుంటా ఈ 5 బ్యాంకులను పరిశీలించవచ్చు.
స్లైల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రస్తుతం అన్నిటికన్నా ఎక్కువ వడ్డీ రేట్లు కల్పిస్తోంది. ఇంతకు ముందు ఈ బ్యాంకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా ఉండేది. ప్రస్తుతం 18 నెలల 1 రోజు నుంచి 18 నెలల రెండు రోజుల టెన్యూర్ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ గరిష్ఠంగా 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. జనరల్ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు మరో 50 శాతం అదనపు వడ్డీ సైతం వస్తుంటుంది. తక్కువ టెన్యూర్ ఎంచుకునే వారు ఈ స్కీమ్ పరిశీలించవచ్చు.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు అధిక వడ్డీ రేటు ఇస్తోంది. 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.20 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు సెప్టెంబర్ 8, 2025 నుంచే అమలులోకి తెచ్చింది. ఇక సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ వస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు గరిష్ఠంగా 7.65 శాతం మేర వడ్డీ లభిస్తోంది. 730 రోజులు (2 సంవత్సరాలు) నుంచి 1095 రోజులు (3 సంవత్సరాల) వరకు మెచ్యూరిటీ టెన్యూర్ ఉండే డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ కొత్త రేట్లను జూలై 25, 2025 నుంచే అమలులోకి తెచ్చింది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు ఏకంగా 8 శాతం వడ్డీ అందిస్తోంది. 1825 రోజుల (5 సంవత్సరాల) మెచ్యూరిటీ పీరియడ్ గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ వర్తిస్తుంది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 7, 2025 నుంచే అమలులోకి తెచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ఇక సీనియర్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం జనరల్ కస్టమర్లకు గరిష్టంగా 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. 500 రోజుల నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ కొత్త వడ్డీ రేట్లను ఆగస్టు 19, 2025 నుంచే అమలు చేస్తోంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే తమ డబ్బులకు భద్రత ఉండదని చాలా మంది భావిస్తారు. కానీ, ఇందులోనూ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. ఈ బ్యాంకుల్లో రూ.5 లక్షల లోపు చేసే డిపాజిట్లకు భద్రత ఉంటుందని స్పష్టమవుతోంది. ఎలాంటి ఆందోళన లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాంక్ దివాలా తీస్తే ఆర్బీఐ ఈ డబ్బులు చెల్లిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa