ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళయరాజాకు భారత్ రత్న ఇవ్వాలి: కేంద్ర ప్రభుత్వానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:13 PM

 ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు చెన్నైలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్.. ఇళయరాజాకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇళయరాజాను జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటులు రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగానే సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఇళయరాజా సంగీతం అమ్మగా జోల పాడుతుందని, బాధలను ఓదార్చి, ప్రేమానుభూతులను కీర్తించి, విజయాన్ని ప్రోత్సహిస్తుందని కొనియాడారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరపున ఇళయరాజా పేరిట ఒక పురస్కారం అందించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇళయరాజా లేకుండా జోల పాటలు, యువతకు ప్రేమ గీతాలు లేవని, ఆయన టైటిల్ కార్డుతోనే అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయని స్టాలిన్ పేర్కొన్నారు. ఇళయరాజాకు 'ఇసైజ్ఞాని' అనే బిరుదును 1988లో కరుణానిధి అందించారని గుర్తు చేసుకున్నారు.


ఈ అరుదైన గౌరవంపై ఇళయరాజా స్పందిస్తూ.. సంగీత ప్రపంచంలో ఏ కంపోజర్‌కూ ఇంత గొప్ప సన్మానం ఇంత వరకు జరగలేదని అన్నారు. రికార్డు చేసిన పాటల కంటే లైవ్ సంగీతం గొప్పగా ఉంటుందని, అందుకే పెద్ద స్టేడియంలో ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈవిషయంలో సీఎం స్టాలిన్ సహాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇళయరాజాను తాను ఎప్పుడూ 'స్వామి' అని పిలుస్తానని చెప్పారు. ఆయన 70, 80వ దశకాల్లో చేసిన పాటలు ఇప్పటికీ సినిమాల్లో పెట్టినా సూపర్ హిట్ అవుతాయని, 'రాగ దేవి' తన సంగీతాన్ని 'రాగ దేవునికి' అర్పించిందని రజనీకాంత్ ప్రశంసించారు.


ఇక చివరగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ ఇళయరాజాకు 'పీఆర్‌ఓ'నే అని సరదాగా చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అభిమానిగా పాటల జాబితాను సిద్ధం చేశారని.. ఆ పాటలనే వేదికపై ఆలపించారని తెలిపారు. ఇళయరాజా, కమల్ హాసన్‌లు కలిసి ఒక పాటకు తమ గళాలను కూడా వినిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa