ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లకు కుక్కలే జంతువులు, ఆవులు కాదు: ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:24 PM

దేశంలో వీధి కుక్కల అంశంపై జరుగుతున్న చర్చపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు జంతు ప్రేమికుల మధ్య కలకలం సృష్టించాయి. ఒక్క వాక్యంలోనే ఆయన వారి ద్వంద్వ నీతిని ఎత్తిచూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా శుక్రవారం రోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. జంతు ప్రేమికులతో తనకు ఇటీవల జరిగిన ఒక సమావేశం గురించి ఒక చిన్న కథనాన్ని వివరించారు. "ఇటీవల నేను కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను" అని ప్రధాని చెప్పగానే.. ప్రేక్షకుల్లో నవ్వులు విరబూశాయి. అయితే అందుకు మోదీ స్పందిస్తూ.. ఎందుకు నవ్వుతున్నారు, మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది గోవును జంతువుగా పరిగణించరని చురక వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రేక్షకులను మరింతగా నవ్వించాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా మోదీ మాటలకు నవ్వు ఆపుకోలేకపోయారు.


సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక ఆదేశం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీధి కుక్కల బెడద, కుక్కకాటు కేసులు, రేబీస్ కేసులు పెరగడం వల్ల వాటిని ఢిల్లీ వీధుల నుంచి తొలగించి, షెల్టర్లలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశంపై జంతు కార్యకర్తలు, పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఈ చర్య వల్ల జంతువులకు షెల్టర్లలో సరైన రక్షణ లభించదని, వాటిపై హింస పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వచ్చిన ఈ నిరసన కారణంగా ప్రధాన న్యాయమూర్తి ఒక అసాధారణ నిర్ణయం తీసుకుని ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనానికి బదిలీ చేశారు.


  కొత్త ధర్మాసనం పాత ఆదేశాన్ని సవరిస్తూ.. వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేసి, వాటిని పరాన్నజీవుల నుంచి రక్షించి, తిరిగి అవి సేకరించిన ప్రదేశాలలోనే వదిలివేయాలని సూచించింది. ఈ తీర్పు జంతు ప్రేమికులకు గొప్ప విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తన వ్యాఖ్యల ద్వారా వీధి కుక్కలు, గోవుల పట్ల జంతు ప్రేమికులు వేర్వేరు ప్రమాణాలను పాటిస్తున్నారని ఎత్తిచూపారు. 'జంతువు' అనే పదం కేవలం వీధి కుక్కలకు లేదా పెంపుడు కుక్కలకు మాత్రమే వర్తించదని.. అన్ని జంతువులకూ అది సమానమని ఆయన పరోక్షంగా సూచించారు.


హిందువులు పవిత్రంగా భావించే గోమాత సంరక్షణ కోసం.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఇందుకోసం 2019లో రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా తన ఢిల్లీ నివాసంలో ప్రధాని మోదీ గోవులకు ఆహారం తినిపిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ఒక దూడను ముద్దాడుతూ కనిపించారు. ఈ సంఘటనలు జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను చూపించాయి. ముఖ్యంగా ఆయనకు ఆవులపై ఎంత ప్రేమ, గౌరవం, భక్తి ఉన్నాయో నిరూపించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa