ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకొండి,,,,కోర్టు సంచలన తీర్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:29 PM

ఆంధ్రప్రదేశ్ కోర్టు ఒకటి సంచలన తీర్పు వెల్లడించింది. అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు సంచలనంగా మారింది. ఇంతకు ఏ ఎమ్మెల్యేకు సంబంధించి కోర్టు ఇలాంటి తీర్పు వెల్లడించింది అంటే.. కడప జిల్లా ప్రొద్దుటూరు, టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. ఆయన తీసుకున్న అప్పు చెల్లించనందుకు గాను ఎమ్మెల్యే ఆస్తులు జప్తు చేయమని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..


ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలకు కడప కోర్టు షాకిచ్చింది. వారు తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో వరదరాజుల రెడ్డి, ఆయన కొడుకు కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు తీర్పు వెల్లడించింది. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అప్పు తీసుకుంది. ఆ అప్పును తిరిగి చెల్లించలేదు.


దాంతో వీరు అప్పు తీసుకున్న హైదరాబాద్‌కు చెందిన పృధ్వీ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ సెక్యూరిటైజేషన్‌ కంపెనీ లిమిటెడ్ కడప కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగా గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్‌ 670/ ఏ1సీ1లో ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని (కామిశెట్టి కాలేజీ) స్వాధీనం చేసుకోవాలని కోర్టు తెలిపింది.


హైదరాబాద్‌కు చెందిన పృధ్వీ కంపెనీకి.. ఈ స్థలాన్ని అప్పగించాలని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్వాధీన ప్రక్రియను అడ్వకేట్‌ కమిషనర్‌ ఇండ్ల రూబెన్ ఆధ్వర్యంలో చేపట్టాలని కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 16న అనగా మంగళవారం ఉదయం 10 గంటలలోపు వరదరాజుల రెడ్డికి చెందిన ఆస్తిని హైదరాబాద్‌కు చెందిన పృధ్వీ కంపెనీకి అప్పగించాల్సి ఉంది.


రాధా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటు మరి కొందరు వ్యక్తులు కూడా సభ్యులుగా ఉన్నారు. వారిలో బద్వేలి శ్రీనివాసులరెడ్డి, మీనా, నంద్యాల కొండారెడ్డి, ఓబుళమ్మ నైనితా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇంద్ర, ఉమాదేవి, హరినాథరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, రఘునాథ రెడ్డి, విజయశేఖర్‌రెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటూ కోర్టు తీర్పు వెల్లడించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కోర్టు తీర్పుల మేరకు మంగళవారం నాడు ఈ ఆస్తుల స్వాధీన ప్రక్రియ జరగనుంది. మరి దీనిపై వరదరాజుల రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa