ఆసియాకప్ 2025లో అధికారికంగా సూపర్-4 చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. గ్రూప్-ఏ నుంచి భారత్ ఈ ఫీట్ సాధించింది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్.. నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. సోమవారం యూఏఈ జట్టు.. ఒమన్ను 42 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ఆడిన 2 మ్యాచ్లలోనూ ఓడిపోయిన ఒమన్.. టోర్నీ సూపర్-4 రేసు నుంచి నిష్క్రమించింది. ఇదే సమయంలో టీమిండియా తదుపరి రౌండ్కు అర్హత సాధించింది.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్థాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. పాక్, యూఏఈలో ఓ జట్టు టీమిండియాతో పాటు సూపర్-4కు చేరనుంది. సెప్టెంబర్ 17న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. విజేతగా నిలిచిన జట్టు.. సూపర్-4కు క్వాలిఫై అవుతుంది. ఓడిపోతే నిష్క్రమించినట్లే. దీంతో పాకిస్థాన్పై కూడా నిష్క్రమణ కత్తి వేలాడుతోంది. యూఏఈతో వారు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా.. మొదటికే మోసం వస్తుంది.
ఇక సోమవారం యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఫస్టు బ్యాటింగ్ చేసిన యూఏఈ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్.. 18.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఫలితంతో యూఏఈ ఆసియాకప్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
సెప్టెంబర్ 19న భారత్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆసియాకప్ లీగ్ స్టేజ్లో ఇదే చివరి మ్యాచ్. ఆ తర్వాత సూపర్-4 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో గ్రూప్-ఏ నుంచి రెండు, గ్రూప్- బి నుంచి రెండు జట్లు ఉంటాయి. ఇందులో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యే సరికి పాయింట్స్ టేబుల్లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. గ్రూప్-బిలో అప్ఘానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa