బాయ్కాట్ డిమాండ్ల మధ్య ఆసియాకప్ 2025 భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ సందర్భంగా మైదానంలో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక మ్యాచ్ పూర్తయ్యాక కూడా ఇదే జరిగింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె.. పాకిస్థాన్ ప్లేయర్లను పట్టించుకోకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. మిగతా ఆటగాళ్లు, స్టాఫ్ సైతం ఇదే ఫాలో అయ్యారు.
పాక్తో మ్యాచ్ ఆడటం టీమిండియా ఆటగాళ్లకు ఇష్టం లేదని.. అందుకే మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటం భారత క్రికెటర్లకు అస్సలు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.
“నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. మీరు మన ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడితే తమ అభిప్రాయం చెబుతారు (ఆసియాకప్లో పాకిస్థాన్ మ్యాచ్పై). నాకు తెలిసి ఆసియా కప్ 2025లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడాలని ఉందా? లేదా? అనే ప్రశ్నకు.. ఆటగాళ్లాంతా లేదని బదులిస్తారు. బీసీసీఐ కారణంగానే వారు మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నారు. నిజానికి పాకిస్థాన్తో మ్యాచ్ ఆడటం నన్ను బాధించింది. విజయం సాధించడం ఓకే.. కానీ మ్యాచ్ ఆడకుండా ఉండాల్సింది” అని సురైన్ రైనా వ్యాఖ్యానించాడు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో ఇటీవల ఇండియా ఛాంపియన్స్ జట్టు.. పాకిస్థాన్ ఛాంపియన్స్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ 2025లో భాగంగా ఇండియా ఛాంపియన్స్ లీగ్ స్టేజ్లో ఓసారి.. సెమీస్లో మరోసారి పాక్తో తలపడాల్సి వచ్చింది. కానీ సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ లాంటి ఇండియా ఛాంపియన్స్ జట్టులోని ప్లేయర్లు మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa