ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం సేకరించాకా పొలాలకు నిప్పు పెడితే జైలుకే: సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 08:19 PM

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే తీవ్రమైన వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతమంది రైతులకు జైలు శిక్ష విధిస్తే.. అది ఇతరులకు కచ్చితమైన సందేశాన్ని ఇస్తుందని, నిరోధకంగా పని చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి అక్టోబర్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను కమ్ముకుంటున్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


న్యాయ సలహాదారు (అమికస్ క్యూరీ) అపరాజిత సింగ్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనానికి కొన్ని విషయాలు వివరించారు. పంట వ్యర్థాలను దహనం చేయకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, యంత్రాలు అందించినా కూడా ఈ సమస్య కొనసాగుతుందని తెలిపారు. గతంలో రైతులు శాటిలైట్ తమ ప్రాంతం మీదుగా వెళ్లని సమయంలో పొలాలను తగులబెట్టమని కొందరు తమకు సలహా ఇచ్చినట్లు కూడా చెప్పారన్నారు. 2018 నుంచి సుప్రీం కోర్టు అనేక కఠినమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. అధికారులు మాత్రం తమ నిస్సహాయతను మాత్రమే విన్నవించుకుంటున్నారని అపరాజిత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.


అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి శిక్షా నిబంధనల గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. “కొంతమందిని జైలుకు పంపిస్తే, అది సరైన సందేశాన్ని పంపుతుంది. వ్యవసాయదారులకు ఏదైనా శిక్ష విధించే నిబంధనల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? పర్యావరణాన్ని నిజంగా పరిరక్షించాలనే ఉద్దేశం మీకు ఉంటే.. ఈ చర్యలు చేపట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. అలాగే రైతులు ప్రత్యేకమైనవారని అన్నారు. వారు పండించే పంటల వల్లే మనం ఆహారం తింటున్నామని చెప్పారు. కానీ దాని అర్థం వారు ఈ సమస్యను అవకాశంగా తీసుకుని వాయు కాలుష్యానికి కారణం కావాలని కాదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.


పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుంది. పంట కోతల తర్వాత పొలాలను శుభ్రం చేయడానికి రైతులు పంట వ్యర్థాలను తగులబెడతారు. ఈ పనిని మాన్యువల్‌గా చేయడం లేదా యంత్రాలను ఉపయోగించడం ప్రత్యామ్నాయ మార్గాలు. అయితే ఈ మార్గాలు ఖర్చుతో కూడుకున్నవి అని రైతులు వాదిస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం పంట వ్యర్థాల దహనం కొనసాగుతూనే ఉంది. పంజాబ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో పంట వ్యర్థాల దహనం కేసులు తగ్గాయని తెలిపారు.


గత మూడేళ్లలో చాలా సాధించామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఇంకా ఎక్కువగా సాధిస్తామని పేర్కొన్నారు. అధికారులు గతంలో పంట వ్యర్థాల దహనం కేసుల్లో అరెస్టులు చేశారని కూడా మెహ్రా తెలిపారు. “కానీ వీరిలో ఎక్కువ మంది చిన్న రైతులు. వారిని జైలుకు పంపితే, వారి కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది?” అని ఆయన వాదించారు. దానికి ప్రధాన న్యాయమూర్తి, “సాధారణంగా కాదు, కానీ ఒక సందేశం పంపడానికి మాత్రమే” అని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. తదుపరి వారం నివేదికలు సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa