ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు అతి పెద్ద శత్రువు ఇదే: గుజరాత్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 07:04 PM

ప్రపంచ వేదికపై భార‌త్‌కు ఎలాంటి పెద్ద శత్రువు లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం గుజరాత్‌లోని భావనగర్‌లో జరిగిన ఒక భారీ సభలో అన్నారు. విదేశాలపై ఆధారపడటమే భారత దేశానికి అతి పెద్ద శత్రువని ఆయన చెప్పారు. స్వావలంబన లేకపోవడం భారత దేశానికి అత్యంత ప్రమాదకరమని, దానిని ఓడించడానికి దేశ ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


“ప్రపంచంలో మనకు ఎలాంటి పెద్ద శత్రువు లేదు. మనకు ఏదైనా శత్రువు ఉందంటే.. అది ఇతర దేశాలపై మనం ఆధార పడటమే. ఇదే మన అతిపెద్ద శత్రువు. మనం కలిసి ఈ శత్రువును, ఈ ఆధార పడటం అనే శత్రువును ఓడించాలి” అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కేవలం ఆర్థికపరంగానే కాకుండా.. స్వావలంబన, జాతీయ గౌరవం, ఆత్మగౌరవం, భద్రతకు కూడా చాలా ముఖ్యమని ప్రధాని నొక్కి చెప్పారు. విదేశాలపై ఆధార పడటం ఎంత ఎక్కువగా ఉంటే.. దేశ వైఫల్యం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్ కావాలని.. ఇది ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సులకు అవసరమని మోదీ పేర్కొన్నారు.


మనం ఇతరులపై ఆధారపడి ఉంటే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని మోదీ అన్నారు. 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టలేమని.. దేశ అభివృద్ధి కోసం మన సంకల్పాన్ని ఇతరుల మీద ఆధార పడటంపై వదిలివేయలేమని అన్నారు. భవిష్యత్ తరాల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టలేమని చెప్పుకొచ్చారు. వందల బాధలకు ఒకే ఒక ఔషధం ఉందన్నారు. అదే స్వావలంబన భారత్ అని మోదీ చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశ పారిశ్రామిక, వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడంలో వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ రెండు విధాలుగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. మొదటిది దశాబ్దాలపాటు భారత దేశాన్ని ప్రపంచ మార్కెట్ నుంచి వేరుచేసిన “లైసెన్స్-కోటా రాజ్” అని, ఆ తర్వాత ప్రపంచీకరణ యుగం వచ్చినప్పుడు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటమని చెప్పుకొచ్చారు.


భారత్‌కు సామర్థ్యానికి కొరత లేదని.. కానీ స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ భారత దేశ సామర్థ్యాలను పూర్తిగా విస్మరించిందని ట్రంప్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు, ఏడు దశాబ్దాలు గడిచినా.. భారత్‌కు దక్కాల్సిన విజయం దక్కలేదన్నారు. చాలా కాలం కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని లైసెన్స్-కోటా రాజ్‌లో చిక్కుకుని, ప్రపంచ మార్కెట్ నుంచి వేరు చేసిందన్నారు. ఆ తర్వాత ప్రపంచీకరణ వచ్చినప్పుడు కేవలం దిగుమతులు చేసుకోవడంపైనే దృష్టి పెట్టిందని.. ఇది దేశ యువతకు భారీ నష్టం కలిగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు భారతదేశ నిజమైన బలాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశాయని మోదీ ఆరోపించారు. ఈ సందర్భంగానే మోదీ భావనగర్‌లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో సముద్ర, ఇంధన, ఆరోగ్యం, రవాణా మరియు పట్టణ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa