ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తకు ఆర్థిక స్తోమత లేకుంటే బహుభార్యత్వానికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 07:06 PM

భార్యలను పోషించే స్తోమత లేని ముస్లిం పురుషుడు బహుభార్యత్వం పాటించకూడదని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక భార్య భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించిన సందర్భంలో.. జస్టిస్ పీ.వీ. కున్హి కృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పోషణకు డబ్బులు లేని ఓ వ్యక్తి.. బహుభార్యత్వం పాటించడం సరికాదని, కోర్టు దీనిని ఆమోదించలేదని ఆయన స్పష్టం చేశారు.


ఈ కేసులో.. పెరింతల్మన్నకు చెందిన 39 ఏళ్ల మహిళ తన భర్త నుంచి నెలకు రూ.10,000 భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె భర్త 46 ఏళ్ల అంధుడు.. వీధుల్లో అడుక్కుని జీవిస్తున్నాడు. గతంలో ఆమె ఇదే పిటిషన్‌ను కుటుంబ కోర్టులో దాఖలు చేయగా.. అడుక్కుని జీవించే వ్యక్తి భరణం చెల్లించమని ఆదేశించలేమని కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఈ విషయాన్ని వివరిస్తూ.. “ఒక భిక్షగాడి పాత్రలో చేయి పెట్టొద్దు” అని మలయాళీ సామెతను వ్యంగ్యంగా ప్రస్తావించింది.


ఈ కేసు విచారణలో.. ఆమె తన భర్త తనను క్రమం తప్పకుండా హింసిస్తున్నాడని చెప్పగా, అంధుడైన తన భర్త తనను హింసించాడనే వాదనను కోర్టు జీర్ణించుకోలేకపోయింది. అయితే పిటిషనర్ విన్నపం ప్రకారం.. భర్త అంధుడైనప్పటికీ అతను మూడో వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆ వ్యక్తి తన మత ఆచార చట్టం ప్రకారం రెండు లేదా మూడు వివాహాలు చేసుకోవచ్చని వాదించాడు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది. “తన భార్యను పోషించే స్తోమత లేని వ్యక్తి రెండో లేదా మూడో వివాహం చేసుకోవడం ముస్లిం ఆచార చట్టం ప్రకారం కూడా సమ్మతం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.


ఖురాన్‌లో బహుభార్యత్వానికి మద్దతు లేదు..


విద్యా జ్ఞానం లేకపోవడం వల్లనే ఇటువంటి వివాహాలు జరుగుతున్నాయని.. ఒక వ్యక్తి భిక్షాటన చేస్తూ వరుసగా వివాహాలు చేసుకోవడం ముస్లిం ఆచార చట్టం ప్రకారం కూడా ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఖురాన్‌లో ఏకపత్నీ వ్రతానికి ప్రాధాన్యత ఇచ్చారని.. బహుభార్యత్వం కేవలం ఒక మినహాయింపు మాత్రమేనని కోర్టు పేర్కొంది. "ఒక ముస్లిం పురుషుడు తన మొదటి, రెండవ, మూడవ, నాల్గవ భార్యలకు న్యాయం చేయగలిగితే మాత్రమే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం ఆమోదయోగ్యం" అని ధర్మాసనం వివరించింది.


అనేకమంది ముస్లింలు ఏకపత్నీ వ్రతాన్ని పాటిస్తున్నారని.. ఇది ఖురాన్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని కోర్టు పేర్కొంది. కేవలం కొద్దిమంది మాత్రమే ఖురాన్‌లోని అసలైన సూత్రాలను మరచి బహుభార్యత్వం పాటిస్తున్నారని.. వారికి మత పెద్దలు, సమాజం సరైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. భిక్షాటనను ఒక జీవనోపాధిగా గుర్తించలేమని, ఎవరూ దానికి పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు నొక్కి చెప్పింది. నిరాశ్రయులైన భార్యలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఆహారం, దుస్తులు వంటివి అందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా పిటిషనర్‌ భర్తకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శికి కోర్టు సూచించింది. అయితే తన భార్యకు భరణం చెల్లించాలని ఒక భిక్షగాడిని ఆదేశించలేనని కుటుంబ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు మరోసారి సమర్థించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa