ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌లో భారతీయులకు ఉద్యోగాల ఆఫర్.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 07:21 PM

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. అమాయకులైన భారతీయులను ఆయా దేశాలకు పంపించి.. అక్కడ చిత్ర హింసలకు గురి చేస్తున్న సంఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా.. కొందరు డబ్బుపై ఆశ, అవసరాల కోసం దళారుల చేతిలో పడి మోసాలకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు భారతీయులను.. ఉద్యోగాల పేరుతో ఇరాన్‌కు తీసుకెళ్లి.. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు కొన్ని రోజుల క్రితం బయటపడటంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత పౌరులు.. ఇలాంటి ఫేక్ ట్రాప్‌లలో పడొద్దని హితవు పలికింది. ఉద్యోగాల ఆశతో విదేశాలకు తీసుకెళ్లే ముఠాలను నమ్మవద్దని తెలిపింది.


ఉద్యోగాల కోసం ఇరాన్‌ వెళ్లాలని భారతీయులను ప్రలోభాలకు గురిచేసిన కేసులు ఇటీవల బయటికి రావడం తీవ్ర దుమారం రేపింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇరాన్‌లోని క్రిమినల్‌ గ్యాంగ్‌లు కిడ్నాప్‌ చేశాయి. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. వారిని విడుదల చేయాలంటే.. భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఫేక్ ఉద్యోగాల విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ హెచ్చరికలు చేశారు.


ఇరాన్‌లో పర్యటించే భారత టూరిస్ట్‌లకు మాత్రమే.. అక్కడి ప్రభుత్వం వీసాలు లేకుండా ఆ దేశంలోకి అనుమతిస్తుందని గమనించాలని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి లేదా ఇతర వాటి కోసం ఇరాన్‌ వెళ్లాలనుకునేవారు.. ఏజెంట్‌లను ఆశ్రయిస్తే.. వారు అక్కడి క్రిమినల్‌ ముఠాలతో కుమ్మక్కై ఉండవచ్చని తెలిపారు. అందుకే ఇలాంటి ఫేక్ ఏజెంట్ల ఉచ్చులో పడకుండా.. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు.


కేరళకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆస్ట్రేలియాలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెళ్లగా.. ఇరాన్‌లో ఓ ముఠా కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. హర్యానాలో ఇమిగ్రేషన్‌ సేవలు అందిస్తున్నట్లు అమన్‌ అనే ఒక వ్యక్తి.. కేరళకు చెందిన హిమాన్షు మాథుర్‌కు పరిచయం అయ్యాడు. హిమాన్షు మాథుర్‌కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన అమన్‌.. అతని వద్ద డబ్బు తీసుకుని ఇరాన్‌కు తీసుకెళ్లాడు. ఇరాన్‌లోని ఓ క్రిమినల్ గ్యాంగ్‌ వారిద్దరినీ.. కిడ్నాప్‌ చేసింది.


అయితే ఆ క్రిమినల్ ముఠాలో అమన్‌ కూడా ఒక భాగమేనని పోలీసులు గుర్తించారు. అనంతరం హిమాన్షు మాథుర్‌ కుటుంబానికి ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. చివరికి రూ.20 లక్షలకు డీల్ అయింది. దీంతో ఆ రూ.20 లక్షలు తీసుకుని కిడ్నాపర్లు హిమాన్షు మాథుర్‌ను విడుదల చేశారు.


ఈ ఘటన కంటే ముందు కూడా మరో ముగ్గురు భారతీయ యువకులు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ రకంగానే కిడ్నాప్‌ కావడం సంచలనం రేపింది. ఏజెంట్ల సాయంతో ఉద్యోగం కోసం ఢిల్లీ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లిన యువకులను ఇరాన్‌లో ఓ ముఠా కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసింది. దీంతో ఈ విషయం కుటుంబ సభ్యుల ద్వారా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. ఇరాన్ పోలీసుల సాయంతో కిడ్నాపర్ల చెర నుంచి యువకులను విడిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa