కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 14 ప్రధాన ఆలయాల్లో భక్తులకు అందించే సేవల రుసుములను పెంచింది. ముజ్రాయ్ శాఖ పరిధిలోకి వచ్చే ఈ ఆలయాల్లో రుసుముల పెంపు నిర్ణయం అధికార, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. సీఎం సిద్ధరామయ్య హిందూ ఆలయాలు, పండుగలకు ఆటంకాలు సృష్టిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ముజ్రాయ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పెంచిన ఫీజులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయం 14 ప్రధాన ఆలయాలపై ప్రభావం చూపనుంది. వీటిలో బెంగళూరులోని శ్రీ యోగనరసింహ స్వామి ఆలయం, శ్రీ నంది తీర్థ స్వామి ఆలయం (మల్లేశ్వరం), చిక్బళ్లాపూర్లోని శ్రీ విదురశ్వత నారాయణ స్వామి ఆలయం, శ్రీ భూ నీల సమేత వెంకటరమణస్వామి ఆలయం (తల్కాయలబేట), దక్షిణ కన్నడలోని కుక్కె శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం, శ్రీ మహాలింగేశ్వర ఆలయం (పుట్టూరు), శ్రీ మహాగణపతి ఆలయం (సౌతడ్క), శ్రీ సూర్య నారాయణస్వామి ఆలయం (మరోలి), బెంగళూరు సౌత్ (రామనగర)లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దేవరహోసహళ్లి), హాసన్ జిల్లాలోని శ్రీ హాళు రామేశ్వర దేవాలయం (దేవాపుర, హొసదుర్గా తాలూకా), చిత్రదుర్గ, రాయ్చూర్లోని శ్రీ సుగురేశ్వరస్వామి ఆలయం (దేవసుగూరు), ఉడుపిలోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయం (మండర్తి, బ్రహ్మావర తాలూకా) ఉన్నాయి.
కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో..
కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ ఆశ్లేష పూజ, నాగ ప్రతిష్టే పూజల రుసుము రూ.400 నుంచి రూ.500లకు పెరిగింది. ఇతర పూజల రుసుములను కూడా పెంచినట్లు IANS వార్తా సంస్థ తెలిపింది. ముజ్రాయ్ శాఖ పరిధిలో మొత్తం 34,566 దేవాలయాలు ఉన్నాయని.. వాటిలో కేటగిరీ 'A' కింద 205, కేటగిరీ 'B' కింద 193, కేటగిరీ 'C' కింద 34,168 దేవాలయాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
ముజ్రాయ్ మంత్రి రామలింగారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. సేవా రుసుములను పెంచాలనే నిర్ణయం ఆయా ఆలయాల పాలక కమిటీలు తీసుకున్నాయని, వాటి సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. “కర్ణాటకలో ముజ్రాయ్ శాఖ కింద 35,000 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక పాలక మండలి ఉంటుంది. వారు ఇలాంటి మార్పులపై నిర్ణయాలు తీసుకుని, ప్రభుత్వ ఆమోదం కోరతారు. 35,000 ఆలయాల్లో కేవలం కొద్దిమంది మాత్రమే ఈ సవరణను కోరారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోదు. అంతేకాకుండా ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లదు. అది ఆయా ఆలయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించబడుతుంది” అని చెప్పారు. కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ చట్టం 2002 ప్రకారం ఇది ఒక సాధారణ ప్రక్రియ అని అధికారులు చెప్పారు.
అయితే ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఈ నిర్ణయంపై శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “సీఎం సిద్ధరామయ్య హిందూ దేవాలయాలు, పండుగలు, ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం ద్వారా ఎలాంటి వికృత ఆనందాన్ని పొందుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు, రాష్ట్రంలోని 14 ప్రధాన ముజ్రాయ్ దేవాలయాల్లో సేవా రుసుములను పెంచడం ద్వారా ఆయన హిందువులను మరోసారి దెబ్బతీశారు” అని అశోక ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa