ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫస్ట్ క్లాస్‌ టికెట్ కొనుక్కొని.. పుణ్యక్షేత్రానికి వెళ్తూ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 07:13 PM

సాధారణంగా రైల్లో ప్రయాణించేవారికి ఎన్నో రకాల అనుభూతులు కల్గుతుంటాయి. అనేక రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు.. వింతవింతగా ప్రవర్తిస్తూ ఒక్కోసారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంటారు. వారు చేసే చిన్న చిన్న తప్పులతో ఎదుటి వాళ్లను తెగ ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు అయితే ఎవరూ తమను చూడట్లేదనుకుని.. చెలరేగిపోతుంటారు. అచ్చంగా ఇలాగే చేసిందో మహిళ. తనను ఎవరూ చూడట్లేదనుకున్న ఆమె దొంగతనానికి పాల్పడింది. కానీ బయటకు వచ్చాక ఆమె చేసిన పనిని గుర్తించిన సిబ్బంది.. దొంగిలించిన వాటిని తిరిగిచ్చే వరకు వదల్లేదు. మరి చివరకు ఆ మహిళ ఏం చేసిందంటే..?


ఒడిశాలోని పూరీ నుంచి ఢిల్లీకి నడిచే పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఒక కుటుంబం దుప్పట్లు, బెడ్‌షీట్లను దొంగిలిస్తూ పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైలు దిగే సమయంలో టికెట్ ఎగ్జామినర్స్ (టీటీఈ), ఇతర రైల్వే సిబ్బంది వారి బ్యాగుల నుంచి దుప్పట్లు, బెడ్‌షీట్లు బయటకు తీయడంతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్లాట్‌ఫామ్‌పై రైల్వే సిబ్బంది నిలదీయడంతో.. ఆ కుటుంబం నిస్సహాయంగా దొంగిలించిన వస్తువులను తిరిగి అప్పగించింది.


 వైరల్‌గా మారిన వీడియోలో.. రైల్వే అటెండెంట్ ఒడియా భాషలో “సార్ చూడండి. బ్యాగ్‌ల నుంచి బెడ్‌షీట్లు, దుప్పట్లు బయటకు వస్తున్నాయి. మొత్తం నాలుగు సెట్ల టవల్స్, బెడ్‌షీట్లు ఉన్నాయి. వాటిని తిరిగి ఇచ్చేయండి లేదా రూ. 780 చెల్లించండి” అని ప్రయాణికుడితో చెప్పడం వినిపించింది. అయితే పట్టుబడిన ప్రయాణికుడు అది పొరపాటున జరిగిందని.. తన తల్లి పొరపాటున వాటిని బ్యాగ్‌లో పెట్టారని చెప్పి తప్పించుకోవాలని చూశాడు. కానీ రైల్వే సిబ్బంది ఆ వాదనను నమ్మలేదు. మొదటి ఏసీలో ప్రయాణిస్తూ... పైగా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఇలా దొంగతనం చేయడం ఏంటని రైల్వే అటెండెంట్ ప్రశ్నించాడు. టీటీఈ జోక్యం చేసుకుని రైల్వేల చట్టం ప్రకారం దీనిని పెద్ద సమస్యగా మార్చే అవకాశం ఉందని హెచ్చరించారు.


ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది దీనిని "అసహ్యం," "సిగ్గులేని పని" అని విమర్శించారు. రైల్వే అధికారులు వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో రైలులో ప్రయాణించకుండా జీవితకాలం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. "ప్రజలు ఇంత దిగజారిపోతారా? ఇవి ప్రయాణికుల సౌకర్యాల కోసం ఉంచిన ప్రభుత్వ ఆస్తులు, సొంతం చేసుకోవడానికి కాదు" అని ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మరొకరు "ఏసీ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించడం ఒక గౌరవం, కానీ బెడ్‌షీట్లు దొంగిలించడం మర్యాద, నిజాయితీ లేకపోవడాన్ని సూచిస్తుంది. మనం ప్రభుత్వ వనరులను గౌరవిద్దాం" అని రాశారు. "వారు తిరిగి ఇచ్చేసినప్పటికీ.. ఈ నేరానికి వారికి జరిమానా విధించాలి. శిక్ష పడే వరకు ఈ ప్రవర్తన ఆగదు. ఇలాంటి వ్యక్తులు దేశానికి అంతర్జాతీయంగా చెడ్డ పేరు తీసుకొస్తారు" అని ఇంకొకరు అన్నారు.


ఈ ఘటనపై కామెంట్ల సెక్షన్‌లో రైల్వే సేవా అనే అధికారిక ఖాతా స్పందిస్తూ.. "ఈ విషయాన్ని సంబంధిత అధికారికి తగిన చర్యల కోసం పంపించాం" అని తెలిపింది. ఆర్థికంగా బాలేక ఆమె ఈ దొంగతనం చేయలేరని, ఇది మానసిక ప్రవర్తన (క్లెప్టోమానియా) అని మరో నెటిజెన్ అభిప్రాయ పడ్డారు. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేంత డబ్బు ఉన్నవారు కూడా టవల్స్, దిండ్లు వంటి చిన్న చిన్న వస్తువులను దొంగిలిస్తారని ఆయన తెలిపారు.


రైల్వే నిబంధనలు


భారతీయ రైల్వేలు సుదూర ప్రయాణాల కోసం స్లీపర్, ఏసీ క్లాస్‌లలో ప్రయాణించేవారికి బెడ్‌షీట్లు, దుప్పట్లను ఉచితంగా అందిస్తుంది. ఈ వస్తువులను రైల్వే సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రం చేసి, నిర్వహించి, ప్రయాణానంతరం తిరిగి తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులు తమ ప్రయాణం ముగిసిన తర్వాత ఈ వస్తువులను సిబ్బందికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ నియమాలను ఉల్లంఘించడం చట్టవిరుద్ధం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa