ఏపీలో మెట్రో ప్రాజెక్టులపై కీలక అప్ డేట్ వచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల టెండర్లు కూడా ఆహ్వానించారు. ఇక ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి చేస్తారనే దానిపై ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులను 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులపై ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టుల టెండర్లపై ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి అప్ డేట్ ఇచ్చారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్కు అవకాశం ఇస్తున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. గరిష్టంగా మూడు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద టెండర్లు వేసుకునే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ప్రీ-బిడ్ సమావేశానికి హాజరైన కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. మెట్రో నిర్మాణ పనులను ప్యాకేజీలుగా విభజిస్తే ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయని.. అందుకే పనులను చిన్న ప్యాకేజిలుగా విభజించకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు.
మరోవైపు విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ పదో తేదీ వరకూ గడువు ఉంది. అలాగే విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అక్టోబర్ 14వ తేదీ వరకూ ఇటీవల గడువు పొడిగించారు. మరోవైపు విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల మొదటి విడత పనుల కోసం రూ.21,616 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 20 శాతం. రాష్ట్ర ప్రభుత్వం వాటా 20 శాతం. మిగిలిన 60 శాతం నిధులను అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుంటారు. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకి సమకూర్చనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం భరించే.. 20 శాతం నిధులను జీవీఎంసీ, సీఆర్డీఏ సమకూరుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa