ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం నమోదు.. అసెంబ్లీలో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 07:50 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం వైద్యారోగ్యశాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ రికార్డు నమోదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల ఆరోగ్యబీమాను కల్పిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.


మనిషి సగటు వయసు 120 సంవత్సరాలని చెప్పిన చంద్రబాబు.. అయితే 120 ఏళ్లకు తినాల్సిన ఆహారాన్ని 40 ఏళ్లకే తినేస్తున్నామని అన్నారు. ఆహారమే ఔషధం.. వంటశాలే ఫార్మసీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాను అనారోగ్య కారణాలతో ఏ రోజు కూడా సెలవు తీసుకోలేదని చంద్రబాబు గుర్తుచేశారు. అవసరమైన దానికంటే అధికంగా తినడం వలనే అనారోగ్యాలు వస్తున్నాయన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానం మార్చుకోవాలని సూచించారు. వంట నూనె , ఉప్పు, పంచదార వాడకం తగ్గించాలని.. 8 గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచించారు.


ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ప్రాక్టీస్‌ చేయాలని.. పోషకాహారం మితంగా తీసుకోవాలని సూచించారు. ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలని.. బతికినంత కాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే తన కోరికని చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఎన్ని పనులు ఉన్నా సరే.. కనీసం 45 నిమిషాలు యోగా లేదా వ్యాయామం చేయాలని సూచించారు.


సిజేరియన్లపై చంద్రబాబు ఆందోళన


మరోవైపు రాష్ట్రంలో 90 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు ప్రైవేటు ఆసుపత్రులలోనే జరుగుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఏమాత్రం ఆమోదించబోమని స్పష్టం చేశారు. సిజేరియన్ ఆపరేషన్లను ఎలా నియంత్రించాలనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2026 నాటికి ఏపీ జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుందన్న చంద్రబాబు.. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల వలనే మనదేశంలో జనాభా బ్యాలెన్స్ అవుతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa