ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగర్ జుబీన్ గార్గ్ మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్టం

national |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 08:34 PM

అస్సామీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగర్ జుబీన్ గార్గ్‌(52)కు తుది వీడ్కోలు సందర్భంగా ఆ రాష్ట్రం మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జుబీన్ గార్గ్ అంత్యక్రియలు ముగిశాయి. అయితే అంత్యక్రియలకు ముందు.. జుబీన్ గార్గ్‌ మృతదేహానికి అధికారులు మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. మంగళవారం ఉదయం గౌహతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో రెండోసారి పోస్ట్‌మార్టం చేశారు. ఆ తర్వాత జుబీన్ గార్గ్‌ చివరి యాత్రకు అస్సాం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.


మంగళవారం తెల్లవారుజామునే సరుసజైలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళ్లిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. జుబీన్ గార్గ్‌ మృతదేహానికి నివాళులు అర్పించారు. 'జుబీన్ అంతిమ యాత్ర ప్రారంభం కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 2 రోజులు రాష్ట్ర ప్రజలకు జుబీన్ గార్గ్‌పై ఉన్న ప్రేమను తెలుపుతోంది. జుబీన్‌ గార్గ్ లాంటి వ్యక్తి ఇక ఎప్పటికీ ఉండరు' అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.


ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన జుబీన్‌ గార్గ్‌.. వ్యవహారంపై తీవ్ర వివాదం సాగుతోంది. సింగపూర్‌లో అత్యాధునిక మెడికల్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నా.. కానీ కొన్ని వర్గాల నుంచి డిమాండ్‌ మేరకు జుబీన్ గార్గ్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించినట్లు సీఎం తెలిపారు. ఆయన మృతిపై ఎలాంటి వివాదాన్ని సృష్టించాలనుకోవడం లేదని.. అందుకే రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఆయన భార్య అనుమతి తీసుకున్నట్లు వెల్లడించారు. జుబీన్‌ గార్గ్ డెత్‌ సర్టిఫికెట్‌పై తీవ్ర అనుమానాలు ఉన్నాయని.. దాన్ని సీఐడీకి అప్పగించనున్నట్లు అంతకుముందే సీఎం చెప్పిన విషయం తెలిసిందే.


ఆదివారం నుంచి జుబీన్ గార్గ్ మృతదేహాన్ని ఈ అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలోనే ఉంచారు. జుబీన్ గార్గ్ పార్థీవ దేహాన్ని చూసేందుకు వచ్చే ప్రజల కోసం స్టేడియం గేట్లను అధికారులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచారు. పోస్ట్‌మార్టం తర్వాత మంగళవారం మృతదేహాన్ని మళ్లీ అదే స్టేడియానికి తీసుకువచ్చిన అధికారులు.. అక్కడి నుంచి గౌహతి శివారులోని సోనాపూర్‌లో ఉన్న కమర్‌కుచ్‌ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు.


మరోవైపు.. జుబీన్ గార్గ్ మృతికి నివాళిగా అస్సాంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే సమయంలో కామ్‌రూప్ (మెట్రో) జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. జుబీన్ గార్గ్ అంతిమయాత్రను ప్రత్యక్షంగా అభిమానులు చూసేందుకు వీలుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.


మరోవైపు.. జుబీన్ గార్గ్ అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశుతోష్ కుమార్, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా సహా పలువురు జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జుబీన్ గార్గ్ చివరి యాత్ర వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలను మూసివేయాలని మేఘాలయ ప్రభుత్వం ఆదేశించింది. అటు.. అస్సాం ప్రభుత్వం మంగళవారం రోజున డ్రైడేగా పాటించింది.


ఇటీవల సింగపూర్ వెళ్లిన జుబీన్ గార్గ్.. ఈ నెల 19వ తేదీన స్కూబా డైవింగ్‌ చేస్తుండగా చనిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను నార్త్‌ ఈస్ట్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఖండించారు. విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబీన్‌ గార్గ్‌ను సింగపూర్‌ హాస్పిటల్‌కు తరలించారని.. ఆయన అక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి.. ఆ తర్వాత జుబీన్ గార్గ్ అస్సాంకు తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa