ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఆదేశాలు పాటించాల్సిందే.. ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన కర్ణాటక హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 08:52 PM

చట్ట విరుద్దమైన కంటెంట్ పోస్ట్ చేసే ఖాతాలను తొలగించకుంటే కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎలాన్ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్ యాప్ ఎక్స్ (ట్విట్టర్) కార్ప్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ‘‘సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉంది.. ముఖ్యంగా మహిళలపై నేరాల కేసులలో నియంత్రించకపోతే రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించి గౌరవంగా జీవించే హక్కుకు అర్ధం లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 79 (3)(బీ) ప్రకారం కార్యకలాపాల నిలివేతపై ఉత్తర్వులు జారీచేసే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, సెక్షన్ 69A ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోగలరని మస్క్ సంస్థ వాదించింది. అలాగే, సెక్షన్ 79 (3)(b) కింద వివిధ మంత్రిత్వ శాఖలు జారీ చేసిన ఆదేశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.


ఈ పిటిషన్‌పై పలు నెలలుగా విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. జులై చివరిలో వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, తీర్పును వెలువరించిన జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం.. ఎక్స్ (ట్విట్టర్) అభ్యర్థనలను తిరస్కరించింది. సమాచారాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఇందులో మీడియాకు సంబంధం లేదని జస్టిస్ నాగప్రసన్న అన్నారు. ‘ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ వ్యాప్తి ఎప్పుడూ నియంత్రణలోనే ఉండాలి..’ అని స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా న్యాయవ్యవస్థలోని నిబంధనలు భారత్‌లో అమలుచేయలేరని తేల్చిచెప్పారు.


‘అమెరికాలోనూ వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో పూర్తిగా మార్పు వచ్చింది.. అమెరికా న్యాయ తర్కాన్ని భారత రాజ్యాంగ భావనల్లో నేరుగా అమలు చేయలేం’ ఉద్ఘాటించారు. అటు, ట్విటర్ పిటిషన్‌ను కేంద్ర వ్యతిరేకించింది. చట్టవిరుద్ధమైన, అక్రమమైన కంటెంట్‌ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు పరిధిలోకి రాదని తెలిపింది.


కాగా, ఫిబ్రవరి 2021 - ఫిబ్రవరి 2022 మధ్య ఏడాది కాలంలో పలు సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను తొలగించాలని 2023లో కేంద్రం ట్విట్టర్‌ని కోరింది. వీటిలో 39 బ్లాకింగ్ ఆర్డర్‌లను ట్విట్టర్ సవాలు చేసింది. నూతన ఐటీ చట్టం నిబంధనల ప్రకారం తన వేదిక నుంచి కంటెంట్‌ను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆ సంస్థ ఆశ్రయించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa