ఢిల్లీలోని శృంగేరి శ్రీ శారదా పీఠం విద్యా సంస్థలోని విద్యార్ధినులపై స్వామి చైతన్యానంద సరస్వతి లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమను స్వామిజీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 17 మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలకు స్వామీజీ జుగుప్సాకరమైన మెసేజ్లు పెట్టి.. వేధింపులకు గురిచేశారు. తన గదికి వస్తే.. ఫారిన్ ట్రిప్కి తీసుకెళ్తానని, ఖర్చులన్నీ తాను భరిస్తానని ఆఫర్ చేస్తూ ఓ యువతికి అత్యంత దారుణమైన మెసేజ్ పెట్టారు.
శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్కు చెందిన 50 మంది మహిళల మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సాప్ డేటాలో డైరెక్టర్ హోదాల ఉన్న స్వామీజీ అసభ్యకరమైన సందేశాలు పంపించడం, బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటం సహా గత 16 ఏళ్లుగా డజన్ల కొద్దీ మహిళలు ఎదుర్కొన్న వేధింపులను వెలుగులోకి తీసుకొచ్చాయి.
స్వామీ చైతన్యానంద ఓ మహిళకు పంపిన మెసేజ్లో డబ్బులు ఇస్తానని చెప్పి ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయగా.... మరొకరికి మార్కులు తక్కువ వేస్తానని బెదిరించారు. ‘నేను చెప్పినట్టు వినకపోతే.. ఫెయిల్ చేస్తా’ అని బ్లాక్ మెయిల్ చేశారు. గత 16 ఏళ్లుగా స్వామీ చైతన్యానంద ఆశ్రమంలో అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అయితే, 2009, 2016లో తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుల నుంచి తప్పించుకోవడం మరింత ధైర్యం వచ్చిందని పోలీసులు తెలిపారు. అతడిపై నమోదైన రెండో కేసులో వసంత్కుంజ్ ఆశ్రమంలోని యువతి ఫిర్యాదు చేయగా.. అటు పోలీసులు, ఇటు ఆశ్రమ వర్గాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒడిశాకు చెందిన ఆయన అసలు పేరు పార్థసారథి.
పోలీస్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం. బాధితులను వాట్సాప్ ఫోన్ కాల్ లేదా మెసేజ్ల ద్వారా స్వామి చైతన్యానంద సంప్రదించేవారు. చాలా సందర్భాల్లో ఆయన పంపిన మొదటి సందేశాలు బెదిరింపులు రూపంలో ఉండేవి కావు. కానీ, ఆ మెసేజ్లకు తాను ఆశించిన సమాధానం లభించకపోతే.. మార్కులు పేరుతో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టేవాడు. ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన యువతలనే లక్ష్యంగా చేసుకునేవాడని, ఎందుకంటే వాళ్లు, వారి కుటుంబాలు బయటకు వచ్చి మాట్లాడరని స్వామిజీకి తెలుసని అన్నారు.
అతడి అరాచకాలకు ముగ్గురు మహిళా వార్డెన్లు సహకరించినట్టు సమాచారం. ఆ ముగ్గురూ వాట్సాప్ ద్వారా మహిళలను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఉంటారని భావిస్తున్నారు. గత నెల ఢిల్లీ డిఫెన్స్ కాలనీ పోలీసులకు 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో స్వామీజీ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని, చివరిసారిగా ఆగ్రాలో కనిపించారని పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa