నా కొడుకును ఇంజినీర్ను చేస్తాను.. నా కూతుర్ని డాక్టర్ను చేస్తాను అంటూ.. చాలా మంది తల్లిదండ్రులు.. ఇతరుల వద్ద గొప్పలు చెప్పుకుంటారు. అసలు చదివే వాళ్లకు ఏం ఇష్టం, వారు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారో కనీసం అడగకుండా.. తమ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుని.. ఈ కోర్సు చదువు, ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకో, ఈ ట్రైనింగ్ తీసుకో అంటూ వారి పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెడుతూ ఉంటారు. సమాజంలో తమ పిల్లలు ఓ డాక్టర్, ఓ ఇంజినీర్, ఓ లాయర్ అయితేనే తమకు విలువ ఉంటుందనే పిచ్చి నమ్మకంతో.. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలకు ఇష్టం లేని చదువులు చదివిస్తూ ఉంటారు. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇష్టం లేని చదువులు చదవలేక.. తీవ్ర మానసిక ఒత్తిడితో చాలా మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలుకా నవర్గావ్ గ్రామానికి చెందిన అనురాగ్ అనిల్ బోరకర్ అనే 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వెలువడిన నీట్ యూజీ 2025 ఫలితాల్లో 99.99 శాతం పర్సంటైల్ సాధించిన అనురాగ్.. ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా 1475వ ర్యాంక్ దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే నీట్లో మంచి ర్యాంకు రావడంతో.. ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పూర్లోని ఓ మంచి కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడికి వెళ్లేందుకు రెడీ కాగా.. అంతలోనే తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనురాగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నవర్గావ్ పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో ఉన్న విషయాన్ని మాత్రం బయటికి చెప్పలేదు. అయితే విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. తనకు డాక్టర్ కావాలని లేదని ఆ సూసైడ్ నోట్లో అనురాగ్ రాసిపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అనురాగ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై నవర్గావ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నీట్లో అంత మంచి ర్యాంక్ సాధించినప్పటికీ.. డాక్టర్ కావాలనే ఇష్టం లేకపోవడం వల్లే అతడు ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు, సమాజం.. విద్యార్థులపై పెడుతున్న తీవ్రమైన ఒత్తిడి, అంచనాల కారణంగానే ఇలాంటి బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయని విద్యావేత్తలు, పలు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa