ఢిల్లీలోని ఓ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత స్వామీజీ చైతన్యానంద సరస్వతి (62) బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. పూర్వ విద్యార్థిని రాసిన లేఖ, భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్) నుంచి వచ్చిన ఈ-మెయిల్ ఈ కీచక స్వామి నిజస్వరూపాన్ని బయటపెట్టాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.వసంత్ కుంజ్లోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ రీసెర్చ్కు చైతన్యానంద సరస్వతి, అలియాస్ పార్థసారథి, డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. జులై 31న ఈ సంస్థలో చదువు పూర్తి చేసుకున్న ఓ యువతి.. విద్యార్థినులను స్వామీజీ లైంగికంగా వేధిస్తున్నారంటూ కాలేజీ యాజమాన్యానికి లేఖ రాసింది. ఆ మరుసటి రోజే, ఎయిర్ ఫోర్స్కు చెందిన ఓ గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి నుంచి యాజమాన్యానికి మరో ఈ-మెయిల్ అందింది. స్వామీజీ విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఈ కాలేజీలో చదివే వారిలో చాలామంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పిల్లలు కావడంతో వాయుసేన జోక్యం చేసుకుంది.ఈ రెండు ఫిర్యాదులతో అప్రమత్తమైన ఇనిస్టిట్యూట్ యాజమాన్యం స్వామీజీకి వ్యతిరేకంగా 300 పేజీల ఆధారాలను జతచేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందే అతనిపై మోసం, ఫోర్జరీ, నమ్మకద్రోహం వంటి ఆరోపణలతో యాజమాన్యం మరో కేసు పెట్టినట్టు తెలిసింది. పోలీసులు విద్యార్థుల వాంగ్మూలాలు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాజమాన్యం వెంటనే స్వామీజీ అధికారాలను రద్దు చేసి, 11 మంది సభ్యులతో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది.ఆగస్టు 3న కొత్త పాలక మండలి దాదాపు 30 మంది విద్యార్థినులతో వర్చువల్గా మాట్లాడగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులను రాత్రి వేళల్లో తన వద్దకు రావాలని స్వామీజీ బలవంతం చేసేవాడని ఆరోపించారు. తన కోరికలు తీర్చకపోతే అకడమిక్ డాక్యుమెంట్లు, డిగ్రీలు నిలిపివేస్తానని బెదిరించేవాడని విద్యార్థినులు వాపోయారు. భద్రత పేరుతో లేడీస్ హాస్టల్లో కెమెరాలు ఏర్పాటు చేశాడని, విదేశీ పర్యటనలకు బలవంతంగా తీసుకెళ్లేవాడని వారు తెలిపారు. ఈ దురాగతాలకు కాలేజీ అసోసియేట్ డీన్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది సహకరించారని విద్యార్థినులు ఆరోపించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం చైతన్యానంద పరారీలో ఉండటంతో, అతను దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. మరోవైపు, కర్ణాటకలోని శృంగేరి శ్రీ శారదా పీఠం ఈ స్వామీజీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. "చైతన్యానంద సరస్వతి చట్టవిరుద్ధమైన, అనుచితమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడు. పీఠం ప్రయోజనాలకు భంగం కలిగించాడు. అందుకే అతనితో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నాం" అని పీఠం ఒక ప్రకటనలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa