విజయవాడ నగరవాసులు సరికొత్త థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి. మూలపాడు నగరవనం అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఈ మూలపాడు నగరవనం అటు విజయవాడకు, ఇటు అమరావతికి దగ్గర్లో ఉండటంతో నగరవనం అభివృద్ధి మీద ఏపీ అటవీశాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీనికి తోడు మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ఇది పూర్తి అయితే ఈ మూలపాడు నగరవనానికి సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నగరవనంలో మరిన్ని సౌకర్యాలు కల్పించనుంది. నగరవనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్తో పాటుగా ఇక్కడున్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసేలా కొత్త సౌకర్యాలు కల్పించనుంది.
మూలపాడు నగరవనం సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం జంగిల్ సఫారీ అందుబాటులోకి తేనున్నారు. ప్రత్యేకమైన వాహనంలో అడవి మొత్తం తిప్పి చూపించనున్నారు. విజయదశమి నుంచి ఈ జంగిల్ సఫారీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక వాహనాలను కూడా ఒక్కో వాహనంలో 13 మంది కూర్చునేలా డిజైన్ చేశారు. ఆంజనేయస్వామి ఆలయం వరకు జంగిల్ సఫారీకి అనుమతి ఉంది. అక్కడికి 700 మీటర్ల దూరంలో జలపాతం ఉంది. జలపాతం అందాలను కూడా పర్యాటకులు వీక్షించవచ్చని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు మూలపాడు నగరవనంలో అడ్వెంచర్ టూరిజం ప్రోత్సహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా జిప్ లైనర్ ఏర్పాటు చేయనున్నారు.ఈ జిప్ లైనర్ను దీపావళి నాటికి ఏర్పాటుచేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండు కొండల మధ్యన 400 మీటర్ల పొడవుతో ఈ జిప్ లైనర్ ఉంటుంది. ఓ కొండపై జిప్ లైనర్ ఎక్కే పర్యాటకులు దీని ద్వారా మరో కొండపైకి చేరుకుంటారు. అలాగే జిప్ సైకిల్ కూడా అందుబాటులోకి తేనున్నారు.
వీటితో పాటుగా సైక్లింగ్ ట్రాకులు, వాకింగ్ ట్రాకులు, ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇక్కడున్న చెరువులో బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తేనున్నారు. చెరువు ఒడ్డున వ్యూపాయింట్ ఏర్పాటుచేసి.. సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రకృతి అందాలను వీక్షించేలా చేయాలని ఆలోచన చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa