ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురికి ఆదర్శంగా.. జీవిత ఖైదు పడిన మహిళా ఖైదీ సక్సెస్ స్టోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 07:11 PM

జీవితంలో అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడు.. ఏదీ కొత్తగా అనిపించదు. అలాగే దేని విలువ మనకు తెలియదు. వస్తువైనా, మనిషైనా, మరొకటైనా మనకు దూరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. కానీ విలువ తెలుసుకునే సరికి.. పుష్కరకాలం దాటిపోతుంది. ఆకులు కాలాక చేతులు పట్టుకున్నట్లు అన్న విధంగా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఎంత ఆలోచించినా ప్రయోజనం లేదు. కానీ కొన్ని విషయాల్లో అలా కాదు.. అలాంటిదే చదువు. చదవాలనే తపన ఉండాలే కానీ పట్టా పొందడానికి వయసు, పరిస్థితితో సంబంధం లేదని నిరూపించారు ఓ మహిళా ఖైదీ. జీవితంలో అంతా కోల్పోయానని భావించే పరిస్థితుల్లో.. ఏదో నేర్చుకోవాలనే తపనతో జైలులో ఉంటూనే చదువుకుని ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టారు. చదువు విలువ తెలియని ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు.


గుంటూరు జిల్లాకు చెందిన దొప్పలపూడి నాగరాజకుమారి . వయసు 50 ఏళ్లు. తన వదిన/మరదలును హత్య చేసినందుకు 2020లో గురజాలలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. నాగరాజకుమారి గత ఐదు సంవత్సరాలుగా రాజమహేంద్రవరం మహిళల కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవించారు. అయితే చదువుకోవాలనే తపనతో ఆమె 2021లో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరారు.2024 నాటికి డిగ్రీ కోర్సు పూర్తి చేశారు. ఆమె అప్పీల్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో.. ఫిబ్రవరి 2025లో ఆమె బెయిల్‌ మీద విడుదలయ్యారు. అయితే జైలులో ఉంటూనే నాగరాజకుమారి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు.


మరోవైపు డిగ్రీలో తాను గోల్డ్ మెడల్ సాధించానని తెలియగానే నాగరాజ కుమారి సంతోషం వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేయాలని చాలా కాలంగా కలలు కన్నానని, కానీ జైలులో ప్రవేశించిన తర్వాతే ఉన్నత విద్యను అభ్యసించడానికి కావాల్సిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం తనకు లభించిందని ఆమె చెప్తున్నారు. "అధ్యాపకులు, జైలు అధికారుల మద్దతుతో, నేను నా డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించగలిగాను. టైలరింగ్, పెయింటింగ్ కూడా నేర్చుకున్నా. చదువుతో పాటుగా అవి కూడా నాకు విలువైనవి"


మరోవైపు సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో జరిగే బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాగరాజకుమారి. స్నాతకోత్సవంలో ప్రముఖుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకునే ఆ క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. జైలు గోడల మధ్య ఉన్నానని కుంగిపోక.. రేపటి మీద ఆశతో, ఏదైనా నేర్చుకోవాలనే తపనతో కష్టపడి చదవి.. గోల్ మెడల్ సాధించిన నాగరాజకుమారి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరోవపు రాజమండ్రి మహిళల కేంద్ర కారాగారం నుంచి ఇప్పటి వరకూ 32 మంది మహిళా ఖైదీలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు పూర్తి చేయడం విశేషం. ఇద్దరు పీజీలు కూడా చేసినట్లు అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa