మనదేశం వ్యవసాయాధారిత దేశం. గ్రామీణ భారతంలోని ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. సేద్యం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు కూడా తీసుకువచ్చాయి. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ, వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటుగా ఆపత్కాలంలో బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ వంటి పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా తమ పంటను ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేయించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో ఈ క్రాప్ బుకింగ్ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. గడువు ముగియడానికి మరి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో రైతులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాల లబ్ధి పొందాలంటే ఈ క్రాప్ డేటా తప్పనిసరి అని చెప్తున్న అధికారులు..ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఈ కేవైసీ కూడా పూర్తి చేయాలని సూచిస్తున్నారు.మరోవైపు ఈ క్రాప్ బుకింగ్ కోసం వ్యవసాయ పంటలకు సంబంధించి మండల వ్యవసాయ అధికారి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు అయితే హార్టికల్చర్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ భూములు, వ్యవసాయానికి అనువు కాని భూములు అయితే మండల తహసీల్దార్ పరిశీలన చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్లో పంటల సాగు సమాచారం, రైతు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు లేదా భారీ వర్షాలు, తుపానుల కారణంగా పంటలు నష్టపోయిన సమయంలో రైతులకు ప్రభుత్వం బీమా అందించి పంట నష్టం నుంచి రైతుకు కొంతమేర ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. అయితే క్రాప్ ఇన్సూరెన్స్ వంటి సమయంలో ఏ పంట వేశారనే సమాచారం అవసరం. అలాగే పథకం ప్రయోజనాలు అనర్హులకు దక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీ విధానాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు తప్పకుండా తమ పంటల వివరాలను ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేయించాలని.. ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa