ఢిల్లీలోని ఓ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో 17 మం0 విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలతో చైతన్యానంద సరస్వతి ని ఢిల్లీ పోలీసులు ఆగ్రాలో అరెస్టు చేశారు. స్వీయ-నియమిత గురువుగా చెప్పుకునే చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిని శనివారం రాత్రి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వసంత కుంజ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించడం, మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి నేరాలపై అతడిని అరెస్టు చేశారు.
చైతన్యానంద సరస్వతి 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన ఫోన్లో హాస్టల్లోని, క్యాంపస్లోని సీసీటీవీ ఫీడ్ల ద్వారా విద్యార్థినులను నిరంతరం గమనిస్తూ ఉండేవాడు. టాయిలెట్ల వెలుపల కూడా కెమెరాలు ఉన్నాయని వారు తెలిపారు. హాస్టల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన సుమారు 75 మంది విద్యార్థినులు ఉండగా.. అందులోని చాలా మందిని బాబా అర్ధరాత్రి వేళ తన గదికి బలవంతంగా రప్పించేవాడని, అనుచితమైన టెక్స్ట్ మెసేజ్లు పంపించేవాడని ఆరోపణలు ఉన్నాయి.
బాధితులలో ఒకరి స్నేహితురాలు ఆరోపించిన దాని ప్రకారం.. అతను విద్యార్థినుల మొబైల్ ఫోన్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని వారి జీవితాలను నియంత్రించేవాడు. దీంతో విద్యార్థులు అతని ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి ఉండేది. విద్యార్థులను బెదిరించి, తన చెప్పినట్లు వినేలా చేసేందుకు మోసపూరిత వలయాన్ని సృష్టించుకున్నాడు. ఈ క్రమంలోనే అర్హత లేని వారికి కూడా తన నమ్మకస్తులైన వారిని ఆశ్రమంలో ముఖ్యమైన పదవులలో నియమించాడు. అతని ఆదేశాలను పాటించని లేదా అతని సహాయకులకు సహకరించని విద్యార్థులను పరీక్షలలో ఫెయిల్ చేస్తామని లేదా కళాశాల నుంచి బహిష్కరిస్తామని బెదిరించేవారని ఆమె ఆరోపించారు.
ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. ప్రాథమిక విచారణలో తెలిసిన ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిందితుడు వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలను ఉపయోగించి, రూ. 50 లక్షలకు పైగా విత్డ్రా చేసుకున్నాడు. బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు, డబ్బు బదిలీ చేసేటప్పుడు అతను వేర్వేరు పేర్లతో రెండు వేర్వేరు ఖాతాలను ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు. జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు అద్దెకివ్వడం ద్వారా అతను ఇన్స్టిట్యూట్పై తన నియంత్రణను పెంచుకున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
ఆరోపణలు బయటపడిన వెంటనే ఆశ్రమం చైతన్యానందను తన పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత అతను పరారయ్యాడు. ఈక్రమంలోనే మరికొంత మంది మహిళలు కూడా బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము కూడా వేధింపులకు గురయ్యామని వివరించారు. సరస్వతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 75(2), 79, 351(2) కింద వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa