తమిళనాడు కరూర్లో జరిగిన తొక్కిసలాట గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశం మొత్తం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటున్నారు. ముఖ్యంగా టీవీకే పార్టీ నేతలంతా.. డీఎంకే నేతలే ఇదంతా చేశారని చెబుతుండగా.. వాళ్లు మాత్రం టీవీకే అధినేత, నటుడు విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటుండగా.. టీవీకే పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈయన తొక్కిసలాటలో అంత మంది చనిపోవడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అదే విషయాన్ని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడిస్తూ.. ఈ ఘటనకు కారణం వారేనని ఆరోపించారు.
విల్లుపురం జిల్లాకు చెందిన 51 ఏళ్ల అయ్యప్పన్ అనే వ్యక్తి టీవీకే పార్టీ కార్యకర్తగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన వృద్ధ తల్లిదండ్రులను చూసేందుకు మైలం గ్రామంలోని స్వగ్రామానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తల్లి మునియమ్మల్ గమనించి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. అయ్యప్పన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే అయ్యప్పన్ గదిలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ లేఖలో, పార్టీ అధినేత విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన కరూర్ తొక్కిసలాటకు డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, పోలీసులే కారణమని ఆరోపించారు. "టీవీకే అధినేత విజయ్ కరూర్ వచ్చినప్పుడు ర్యాలీకి తగినంత పోలీసు రక్షణ కల్పించలేదు. ఈ విషాదం జరగడానికి ప్రధాన కారణం మంత్రి సెంథిల్ బాలాజీయే. ఇందులో పోలీసులకు కూడా ప్రమేయం ఉంది. మంత్రిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి" అని అయ్యప్పన్ తన సూసైడ్ నోట్లో రాశారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
శనివారం రోజు నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన టీవీకే పార్టీ ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa