ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు ఆటంకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 07:05 PM

విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎదురువుతోన్న ఆటంకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ సంస్థ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేసిన సంగతి తెలిసిందే. అయితే, రైతులకు తెలీకుండా తప్పుడు కేసులు వేసినట్టు వెలుగులోకి రావడంపై చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడికి విశాఖ విమానాశ్రయంలో భీమిలి ఎమ్మెల్యే,మాజీ మంత్రి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ పురోగతి, ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వారు వివరించారు.


ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోన్న వారిపై కఠిన చర్యలకు ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రైతుల ముసుగులో కేసులు వేసినవారి విషయంలో ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. రైతులకు సంబంధం లేకుండానే వారి పేర్లతో కేసు వేయడం.. అందులో చనిపోయిన ఓ రైతు పేరు ఉండటం పట్ల తీవ్రంగా పరిగణించాలని సూచించారు. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇంటి నిర్మాణానికి 3 సెంట్ల స్థలం డిమాండ్ గురించి సీఎం దృష్టికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీసుకెళ్లారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.


ఈ క్రమంలో భూసేకరణకు ఒకసారి పరిహారం ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడం ఎక్కడ జరగదని, కానీ, ఇక్కడి రైతుల విజ్ఞ‌ప్తిని దృష్టిలో ఉంచుకుని పెంచామనే విషయాన్ని గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.


కాగా, గూగుల్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబరులోనే గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత గూగుల్ నెట్‌వర్క్ వైస్ ప్రెసిడెంట్ విశాఖలో పర్యటించి, అనువైన ప్రాంతాలను పరిశీలించారు. చివరకు ఆనందపురం సమీపంలో ప్రభుత్వం భూములను గుర్తించింది. భూసేకరణ ప్రక్రియ నెల రోజుల్లోనే ముగించి, నవంబరులో గూగుల్ సంస్థకు అప్పగించాలని భావించింది. కానీ, భూములను అప్పనంగా కట్టబెడతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa